
తన కష్టం తనయుడికి రావొద్దని..
పాల్వంచరూరల్ : తాను పడుతున్న కష్టాలు కుమారుడికి రావొద్దనే ఆశయంతో ట్రాలీ ఆటో నడుపుతూ జీవనం సాగించే ఓ తండ్రి కొడుకును లండన్లో ఎంఎస్ చదివిస్తున్నాడు. పాల్వంచ ఇందిరానగర్ కాలనీకి చెందిన మూడు లక్ష్మణ్ పగలూ, రాత్రి తేడా లేకుండా ఆటో నడుపుతూ కొడుకు నవీన్నాయక్ను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివించాడు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ఇంటిని తాకట్టు పెట్టి ఉన్నత విద్య కోసం గతేడాది లండన్ పంపించాడు. ప్రస్తుతం నవీన్ లండన్లోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీలో ఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఉన్నత చదువు పూర్తిచేసి ఉద్యోగం సాధిస్తే తన కష్టానికి ఫలితం దక్కుతుందని అంటున్నాడు లక్ష్మణ్.