రక్తదాతలు.. ప్రాణదాతలు.. | - | Sakshi
Sakshi News home page

రక్తదాతలు.. ప్రాణదాతలు..

Jun 14 2025 7:25 AM | Updated on Jun 14 2025 7:25 AM

రక్తదాతలు.. ప్రాణదాతలు..

రక్తదాతలు.. ప్రాణదాతలు..

భద్రాచలంఅర్బన్‌: ఎన్నో సందర్భాల్లో రక్తం సకాలంలో అందక ప్రాణాలు కోల్పోతున్నవారు చాలామంది ఉన్నారు. ఆధునిక చికిత్స అందుబాటులోకి వచ్చినప్పటికీ రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాక తనువు చాలించాల్సిన ఘటనలు అనేకం. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయి. ఈ రక్తాన్ని కేవలం మరో వ్యక్తి నుంచే సేకరించాలి. అందుకే రక్తదానానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం రక్తదానంపై విద్యావంతులు, యువకుల్లో అవగాహన పెరిగింది. అవసరమైన వారికి రక్తదానం చేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. రక్తదానం వెలకట్టలేనిది. సరైన సమయానికి దొరికితే ఓ నిండు ప్రాణం నిలబడుతుంది. రక్తదానం అన్నది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్పదానం. రక్తం ఆవశ్యకత తెలిసినప్పటికీ ఇప్పటికీ రక్తదానం చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తూనే ఉన్నారు. రక్తదానం చేయడం వల్ల బలహీనత వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంది. నిరక్ష్యరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈ భావన బలంగా ఉంది. అయితే ఆరోగ్యవంతులు రక్తదానం చేస్తే మరింత ఆరోగ్యవంతులుగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

రక్తదానం కోసం వాట్సప్‌ గ్రూపులు..

ప్రస్తుతం కొందరు యువకులు రక్తదానం చేసేందుకు చాలా చొరవ చూపుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్‌ ఫోన్‌ ఉండటంతో సామాజిక దృక్పథం గలవారితో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి తద్వారా అవసరమైన వారికి రక్తదానం చేయిస్తున్నారు. ఎవరికై నా పలానా బ్లడ్‌ గ్రూపు కావాల్సి ఉందని వివిధ రకాల గ్రూపుల్లో మెసేజ్‌ పెట్టినా రక్తం అందుతోంది. ఇలా భద్రాచలంలో మొత్తం 7 వాట్సాప్‌ గ్రూప్‌లు నిత్యం రక్తదానాలపై పనిచేస్తున్నాయి.

మొబైల్‌ ఫోన్‌ బ్లడ్‌ బ్యాంకుగా..

మొబైల్‌ ఫోన్‌నే ఓ బ్లడ్‌ బ్యాంకుగా కూడా సృష్టించుకోవచ్చు. స్నేహితులు, సన్నిహితులు, బంధువుల నంబర్లు ఫీడ్‌ చేసుకునే సమయంలోనే వారి బ్లడ్‌ గ్రూపు కూడా ఫీడ్‌ చేసుకుంటే అదే ఓ బ్లడ్‌ బ్యాంక్‌ అయ్యే అవకాశముంది. ఎవరికై నా ఏదైనా గ్రూపునకు సంబంధించి బ్లడ్‌ అవసరం అని తెలియగానే మన మొబైల్‌ ఫోన్లో ఆ గ్రూపుబ్లడ్‌ వారికి ఫోన్‌చేసి రక్తదానం చేసే ఏర్పాటు చేయించవచ్చు.

ఎవరు రక్తదానం చేయవచ్చు..?

రక్తదానం చేయడానికి ఉండాల్సింది రెండే అర్హతలు. చక్కటి ఆరోగ్యం, మంచి మనసు. 19 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన సీ్త్ర, పురుషులు ఎవరైనా 45 కేజీల బరువు పైబడి ఉన్నవారు, 12.5 ఎంజీ హిమోగ్లోబిన్‌ కలిగిన వారు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు నిస్సంకోచంగా రక్తదానం చేయవచ్చు.

ఎంత రక్తం సేకరిస్తారు?

ఒక మనిషి నుంచి కేవలం 300 మిల్లీలీటర్ల రక్తం మాత్రమే సేకరిస్తారు. సాధారణంగా మనుషుల్లో 5 నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తే ఒక లీటరు వరకు రక్తం పోతుంది. అయినా మనిషికి ఏమీకాదు. దీన్ని తెలుసుకుంటే కేవలం 300 మిల్లీలీటర్ల రక్తదానం చేయడం వల్ల ఏమీ కాదని అర్థమవుతుంది.

బ్లడ్‌ డొనేషన్‌పై యువకుల్లో పెరిగిన అవగాహన

ఆపద సమయాల్లో రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్న యువత

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

రక్తదానంతో ప్రయోజనాలు..

రక్తదానంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తదానం చేయడం వల్ల శరీరంలో పాత రక్తం పోయి కొత్తరక్తం ఉత్పత్తి అవుతుంది. బ్లడ్‌ ప్లాస్మా కూడా పునరుజ్జీవం పొంది ల్యూకోసైట్ల పెరుగుదలకు సహాయపడుతుంది. రక్తదానం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కేన్సర్‌ను దూరం చేస్తుంది. రక్తదానం చేస్తుండటం వల్ల శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే గుర్తించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement