
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు
డీఈఓ వెంకటేశ్వరా చారి
చుంచుపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ బోధనతో పాటు మెరుగైన సౌకరాయలు కల్పిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని పెనుబల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ఆయన విద్యార్థులకు నోట్, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు వారానికి మూడు రోజులు కోడిగుడ్లు, మరో మూడు రోజులు రాగిజావ వంటి పౌష్టికాహారం అందిస్తున్నామని, నిపుణులైన ఉపాధ్యాయులతో తరగతులు బోధిస్తున్నామని చెప్పారు. పిల్లలను రూ.లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్లకు పంపించకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, పాఠశాల హెచ్ఎం నిర్మల, రాజయ్య, శారద హరిలాల్, విజయ, సుజాత, సెక్టోరియల్ అధికారి సైదులు, సీఆర్పీలు మధు, రవి పాల్గొన్నారు.
సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి అన్నారు. గురువారం ఆయన చుంచుపల్లిలోని జీహెచ్ఎస్, విద్యానగర్లోని ప్రాథమిక పాఠశాల, లక్ష్మీదేవిపల్లి, చాతకొండ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న అధునాతన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, జీవన నైపుణ్యాలు మరెక్కడా లభించవని అన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. పలు పాఠశాలల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఈఓలు బాలాజీ, కృష్ణయ్య, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు, ప్రధానోపాధ్యాయురాలు తబితా సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.