
11 ఏళ్లుగా సుస్థిర పాలన
చుంచుపల్లి: గత 11 ఏళ్లుగా దేశంలో సుస్థిర పాలన సాగుతోందని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు పేరాల శేఖర్రావు, పోరెడ్డి కిషోర్రెడ్డి అన్నారు. గురువారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమ విధానాలతో దేశ దశ దిశను మార్చారని తెలిపారు. తద్వారా ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, త్వరలో తెలంగాణలోనూ పార్టీ హవా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు జీవీకే మనోహర్, నాయకులు విద్యాసాగర్, కృష్టారెడ్డి పాల్గొన్నారు.