
విద్యార్థులకు నాణ్యమైన భోజనం
భద్రాచలంఅర్బన్ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. 50 ఆశ్రమ పాఠశాలలు, 14 వసతి గృహాలు, 22 పీఎంహెచ్ హాస్టళ్లకు కూరగాయలు, పండ్లు, చికెన్, కోడిగుడ్లు సరఫరా చేసే ఏజన్సీల సమక్షంలో ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం టెండర్ బాక్స్లు తెరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాదాపు 40 మంది ఏజన్సీదారులు టెండర్లు దాఖలు చేశారని, తక్కువ ధర కోట్ చేసిన వారినే ఆమోదించామని తెలిపారు. అనంతరం టెండర్దారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెనూ ప్రకారమే సరుకులు సరఫరా చేయాలని, వారం మొత్తానికి ఒకేసారి కాకుండా మూడుసార్లు అందించాలని సూచించారు. వారానికి ఐదు రోజులు అరటి పండ్లు, రెండు రోజులు ఇతర పండ్లు పంపిణీ చేయాలన్నారు. నాసిరకమైన సరుకులు సరఫరా చేసినట్లు ఫిర్యాదు అందితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని, తమ పరిధిలోని విద్యాసంస్థల్లో మూడేళ్ల పాటు టెండర్ దాఖలు చేయకుండా బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఈఈ హరీష్, ఏసీఎంఓ రమేష్, ఏటీడీఓలు అశోక్ కుమార్, రాధమ్మ, హెచ్ఎంలు నరసింహారావు, సావిత్రి, వార్డెన్లు లక్ష్మి, నాగరాజు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్ వెల్లడి