
కూనంనేనికి ఊరట
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందున కూనంనేనిపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతకుముందు ఏడాదిన్నర పాటు ఈ పిటిషన్పై వాదోపవాదాలు జరిగాయి.
గెలిచిన వెంటనే..
తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. అయితే నామినేషన్ దాఖలు సమయంలో ఫామ్–26 అఫిడవిట్లో కూనంనేని సమగ్ర వివరాలు వెల్లడించలేదంటూ కొత్తగూడేనికి చెందిన నందూలాల్ అగర్వాల్ 2024 జనవరి 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూనంనేని తన భార్య పేరును అఫిడవిట్లో పేర్కొనలేదని, లైసెన్స్డ్ నోటరీతో అఫిడవిట్ చేయించలేదనే అభ్యంతరాలను నందూలాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతుండగానే మరింత సమాచారం కోసం గతేడాది డిసెంబర్లో హైకోర్టు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో కూనంనేని సాంబశివరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నందూలాల్ అగర్వాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని కోరారు. అయితే హైకోర్టులో వాదనలు పూర్తి కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూనంనేని పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. దీంతో అనర్హత కేసు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి గడిచిన ఆరు నెలలుగా కొనసాగింది.
తుది తీర్పు వచ్చాక..
ఏడాదిన్నర వ్యవధిలో ఇటు కమిషన్, అటు హై కోర్టులో 20 సార్లకు పైగా ఇరు వర్గాల నడుమ వాదనలు జరిగాయి. చివరకు ఈ కేసులో తీర్పును ఈనెల 9కి రిజర్వ్ చేసినట్టు 7వ తేదీన హైకోర్టు తన వెబ్సైట్లో పేర్కొంది. దీంతో ఈ కేసులో తీర్పు ఏ రకంగా ఉంటుందనే ఉత్కంఠ రెండు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొంది. సీపీఐతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కేడర్ ఈ తీర్పుపై ఆసక్తి చూపించింది. అయితే నందూలాల్ అగర్వాల్ లేవనెత్తిన అభియోగాల్లో మెరిట్స్ లేనందున ఆయన దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు సోమవారం హైకోర్టు వెల్లడించింది. కూనంనేనికి అనుకూలంగా తీర్పు రావడంతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో సీపీఐ కార్యకర్తలు సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. రెండు పట్టణాల్లోనూ ర్యాలీలు తీశారు.
గతంలో వనమాపై..
ఎన్నికల అఫిడివిట్లో వివరాలు, అనర్హత అంశంపై కొత్తగూడెం నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో ఆయన పూర్తి వివరాలు పేర్కొనలేదంటూ ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జలగం వెంకట్రావ్ 2020లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మూడేళ్లకు పైగా విచారణ తర్వాత వనమా ఎన్నిక చెల్లదని, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని 2023 జూలైలో తీర్పు వెలువడగా.. వనమా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అక్కడ విచారణ దశలో ఉండగానే 2023 నవంబర్ 30న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వనమా ఓడిపోగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఫలితా లు వెలువడిన మరుసటి నెలలో కూనంనేని ఎన్నికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం, ఇక్కడి రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది.
అనర్హత పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు
2024 జనవరిలో దాఖలైన పిటిషన్
ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిన న్యాయస్థానం
20సార్లకు పైగా కొనసాగిన వాదనలు
సీపీఐ శ్రేణుల సంబరాలు..
కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ/సుజాతనగర్ : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అనర్హత పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం పట్ల కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లో సీపీఐ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కొత్తగూడెంలో సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నుంచి మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన సెంటర్లలో బాణ సంచా పేల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పాల్వంచలో అంబేద్కర్ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొంతమంది దురుద్దేశంతో కూనంనేనిపై అనర్హత పిటిషన్ వేశారని, అయినా న్యాయం తమ వెంటే ఉందని అన్నారు. ఇది ప్రజల విజయమని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు ముత్యాల విశ్వానాధం, వీసంశెట్టి పూర్ణచందర్ రావు, సాయిబాబా, రాహుల్, రెహమాన్, దుర్గరాసి వెంకటేశ్వర్లు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, మునిగడప వెంకటేశ్వర్లు, గెడ్డాడు నగేష్, భూక్యా శ్రీనివాస్, కె రత్నకుమారి, భూక్యా దస్రు, కొమారి హనుమంతరావు, జక్కుల రాములు, వీర్ల మల్లేష్, తాళ్లూరి ధర్మారావు, బొడ్డు కేశరావు మూడు గణేష్, మహ్మద్ యూసఫ్, ఎస్కే ఫహీమ్, శ్రీనివాస్, సత్యనారాయణ చారి, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కూనంనేనికి ఊరట