
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
జూలూరుపాడు: భూ భారతి సదస్సులతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని కాకర్ల రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు అందించిన దరఖాస్తులను తక్షణమే ఆన్లైన్ చేయాలని, వివరాల నమోదులో తప్పులకు తావు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదు అందించాలని, రిజిష్టర్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. భూ రికార్డుల్లో పేర్ల తప్పులు, భూ విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ పుస్తకం లేకపోవడం, సాదాబైనామా కేసులు తదితర సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. అనంతరం భేతాళపాడులోనూ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ టి. శ్రీనివాస్, ఆర్ఐ సీహెచ్.ఆదినారాయణ, ఏఎస్ఓ నరసింహారావు, సీనియర్ అసిస్టెంట్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.
30 వరకు రేషన్ బియ్యం పంపిణీ..
సూపర్బజార్(కొత్తగూడెం): జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఈనెల 30వ తేదీ వరకు ఒకేసారి పంపిణీ చేస్తున్నామని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
58 వేల యూనిఫామ్ల తయారీ పూర్తి..
కొత్తగూడెంఅర్బన్: జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 58 వేల యూనిఫామ్ తయారు చేసి పాఠశాలలకు అందించామని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్ బంక్ నిర్వహణకు రామవరంలో 12 కుంటల భూమి గుర్తించామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఈఓ వెంకటేశ్వరా చారి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వేణుగోపాల్