
కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం
కొత్తగూడెంఅర్బన్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికమని కొత్తగూడెంలోని జర్నలిస్టులు, ప్రజా, సంక్షేమ సంఘాల నాయకులు అన్నారు. శ్రీనివాసరావు అరెస్టును ఖండిస్తూ సోమవారం రాత్రి కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష గట్టి సాక్షి దినపత్రిక, న్యూస్ చానల్పై దాడులు చేస్తోందని, అక్రమ అరెస్టులు చేయడం జర్నలిజంపై గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. ప్రజలకు – ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా, వారి మాటలను తప్పబడుతూ, అధికారం ఉందనే అహంకారంతో అరెస్టు చేయడాన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. సాక్షిలో పనిచేసే ముఖ్యులను టార్గెట్ చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యంలో పత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మేధావులు, సమాజంలోని అన్ని వర్గాల వారు ముందుకు రావాలని కోరారు. అక్రమ అరెస్టులతో ఇబ్బంది పెడుతున్న పచ్చ ప్రభుత్వం భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సాక్షి, వెలుగు, నమస్తే తెలంగాణ, ప్రజాజ్యోతి పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు తాండ్ర కృష్ణగోవింద్, రాజేందర్, వెంకన్న, అశోక్, జర్నలిస్టులు భాస్కర్రెడ్డి, జునుమాల రమేష్, వీరు, రేశ్వంత్, తారక్, ఈశ్వర్, వాసాల శేఖర్, కృష్ణారావు, సాయి ప్రసాద్ రెడ్డి, రాము, గాంధీపథం జిల్లా కన్వీనర్ చింతలచెర్వు గెర్షోము తదితరులు పాల్గొన్నారు.