
స్వయం ఉపాధి కోసమే దరఖాస్తు చేయాలి
భద్రాచలం: గిరిజన దర్బార్లో స్వయం ఉపాధి పథకాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం స్వీకరించబోమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. పరిష్కారానికి యూనిట్ అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన దర్బార్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి, ఇతర సమస్యలపై మాత్రమే దరఖాస్తులు అందించాలని, ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, పాఠశాల, కళాశాలల్లో సీట్లు నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తామని వెల్లడించారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని, విద్యార్థులకు అన్ని వసతులతో స్వాగతం పలకాలని సూచించారు.
విద్యార్థినికి ఆర్థిక సాయం..
అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన విద్యార్థిని వైశాలిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో బీఏలో సీటు సాధించగా.. మొదటి, రెండో సంవత్సరాలకు ఐటీడీఏ ద్వారానే ఆర్థిక సాయం అందజేశారు. కాగా ఇతర కోర్సు, హాస్టల్ ఫీజు నిమిత్తం సోమవారం ఆమెకు రూ.19,280 చెక్కును పీఓ అందజేశారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఈఈ హరీష్, ఎస్ఓ భాస్కరన్, ఏఓ సున్నం రాంబాబు, ఏపీఓ వేణు, అధికారులు లక్ష్మీనారాయణ, ఉదయ్కుమార్, మనిధర్, ఆదినారాయణ పాల్గొన్నారు.