అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 62 మంది బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను నేరుగా ఎస్పీకు వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న అనంతరం జిల్లా ఎస్పీ జిల్లాలోని పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులతో మార్యాదగా మెలగాలని కోరారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని పరిష్కరించాలన్నారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణిత గడువులోగా పరిష్కారం చూపాలని వివరించారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసా కల్పించినప్పుడే పోలీస్శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. ప్రధానంగా వచ్చే ఫిర్యాదులు కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలపై వస్తున్నాయన్నారు. వాటిపై క్షుణ్ణంగా అధ్యాయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్నాయక్, పీజీఆర్ఎస్ సీఐ యు.శ్రీనివాసరావు, మహిళా ఎస్ఐ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.


