
ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
పొన్నూరు: ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదంలో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పొన్నూరు పట్టణ ఎస్ఐ శ్రీహరి తెలిపారు. మునిపల్లె గ్రామానికి చెందిన గొడ్డేటి శ్యాంకుమార్కు వట్టికూటి సత్య సాయిబాబు, వట్టికూటి వెంకట రామానాయుడు, గుత్తికొండ రాజేష్లకు ధాన్యానికి సంబంధించిన సుమారు రూ.40 లక్షల బాకీ విషయంలో వివాదం నెలకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని నేపథ్యంలో శ్యాంకుమార్ జిల్లా ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది మే 8వ తేదీన ఆ ఫిర్యాదు రూరల్ పోలీస్స్టేషన్లో విచారణకు రావడంతో పోలీసుస్టేషన్ ఎదుట ఇరువర్గాలు మాట్లాడుకునే క్రమంలో వాగ్వాదం జరిగింది. తనను కులం పేరుతో దూషించారని శ్యాంకుమార్ ఫిర్యాదు చేశాడు. స్టేషన్ బయట రోడ్డుపై జరగడంతో శ్యాంకుమార్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
అద్దంకి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో ట్రాక్టర్ మెకానిక్ మృతి చెందాడు. ఈ ఘటన పట్టణంలోని కలవకూరు రహదారిలో శనివారం జరిగింది. అందిన సమాచారం మేరకు బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామానికి చెందిన అల్లా ఉద్దీన్ (45)ట్రాక్టర్ మెకానిక్గా పని చేస్తున్నాడు. ఇతను అద్దంకి పట్టణంలో ఒక షెడ్ ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్లు రిపేర్ చేస్తుంటాడు. ప్రతి రోజూ అద్దంకి వచ్చి రాత్రికి తిరిగి వెళుతుంటాడు. ఈ క్రమంలో అద్దంకి నుంచి బైక్పై స్వగ్రామం వెళుతుండగా కలకూరు రహదారిలో కారు, బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మెకానిక్ మృతి చెందాడు. మృతునికి భార్య ఫాతిమా బీ, ఇద్దరు పిల్లలున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
● పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిన ఉత్తర్వులు దహనం చేసిన ఏఐఎస్ఎఫ్
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): విద్యార్థుల హక్కులను హరించేలా పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వులను అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ తీవ్రంగా ఖండించారు. గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు విద్యార్థి హక్కులపై దాడిగా భావిస్తూ, తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు చెప్పడతామని హెచ్చరించారు.
మిరప పంటకు బీమా గడువు పొడిగింపు
నరసరావుపేట రూరల్: మిరప సాగుచేసే రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువు తేదీని పెంచినట్టు పల్నాడు జిల్లా ఉద్యానశాఖ అధికారి ఐ.వెంకట్రావు శనివారం తెలిపారు. మిరప సాగు చేసే రైతులు ఎకరాకు రూ.360లు ప్రీమియం చెల్లించినట్టయితే బీమా మొత్తం రూ.90వేలు వర్తిస్తుందని వివ రించారు. పంటల సాగు కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందే వారికి బ్యాంకులే ప్రీమి యం వసూలు చేసి బీమా కంపెనీకి చెల్లి స్తాయని తెలిపారు. బ్యాంకు రుణం పొందిన వారికి ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు తెలిపారు. పంట రుణాలు తీసుకోని రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఆన్లైన్లో ప్రీమియం చెల్లించవచ్చని సూచించారు.

ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు