
రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసగించిన చంద్రబాబు
బాపట్ల: రాష్ట్ర ప్రజలను చంద్రబాబునాయుడు మళ్లీ మోసం చేసి ప్రజాగ్రహానికి గురయ్యారని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ‘జగన్ అంటే నమ్మకం...చంద్రబాబు నాయుడు అంటే మోసం’ అనే పుస్తకాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ఏడాదిలోపే మళ్లీ బాబు తన నైజాన్ని ప్రదర్శించారని దుయ్యబట్టారు. అమ్మఒడి పథకంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి 87లక్షల మంది తల్లుల ఖాతాలోకి నగదు జమ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు ఎంతమంది తల్లులు ఉంటే అంతమంది ఖాతాలకు తల్లికి వందనం వేస్తానని చెప్పి 50లక్షల మందికి మాత్రమే అర్హుల జాబితాలో చొటు కల్పించారన్నారు. 50 సంవత్సరాల మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన మాటలు అమలుకు నోచుకోలేదన్నారు. ఆడబిడ్డ నిధి, ఉద్యోగాల కల్పన విషయంలో కూడా చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలపై దాడులు పెరిగిపోయాయని చెప్పారు. మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతుంటే చోద్యం చూస్తున్నారని తెలిపారు. అయ్యో...ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు పోతుందని ఏడాదిలోపే ప్రజలు ఎదురుచూస్తున్నారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, గవిని కృష్ణమూర్తి, చల్లా రామయ్య, నక్కా వీరారెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, జోగి రాజా, తన్నీరు అంకమ్మరావు, కత్తి సుందరరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున
‘జగన్ అంటే నమ్మకం...చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ