
పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలు పరిష్కరించండి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: పీజీఆర్ఎస్లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు మా సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కలసి వినతి పత్రాల ద్వారా కోరారు. తన పరిధిలో ఉన్న వాటికి ఆయన తక్షణమే పరిష్కార మార్గం చూపగా కొన్నింటిని పరిశీలించి, మరికొన్నిటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
చెరువులు, కుంటలు, సాగునీటి కాల్వల ఆక్రమణలను మూడు నెలలలో తొలగించాలని కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24,327 నీటి సంఘాల కమిటీలు ఉన్నాయన్నారు. 48,020 ఎకరాలు నీటి సంఘాల పరిధిలో ఉన్నాయన్నారు. 305 చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. 2,449 మంది ఆక్రమణదారులు 299 ఎకరాలను ఆక్రమించారని చెప్పారు. ఆక్రమణలు తొలగించే ప్రక్రియకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్గౌడ్, ఆర్డీవో పి గ్లోరియా, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.