22న పూర్వ విప్లవ విద్యార్థి వేదిక సదస్సు | - | Sakshi
Sakshi News home page

22న పూర్వ విప్లవ విద్యార్థి వేదిక సదస్సు

Jun 16 2025 6:01 AM | Updated on Jun 16 2025 6:01 AM

22న పూర్వ విప్లవ విద్యార్థి వేదిక సదస్సు

22న పూర్వ విప్లవ విద్యార్థి వేదిక సదస్సు

గుంటూరు ఎడ్యుకేషన్‌: పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఈనెల 22న గుంటూరు మెడికల్‌ కళాశాల ఎదుట ఉన్న ఎన్జీవో కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించనున్నట్లు వేదిక నాయకులు నవజ్యోతి, భరద్వాజ తెలిపారు. ఆదివారం బ్రాడీపేటలో కార్యక్రమ పోస్టర్లు విడుదల చేశారు. భరద్వాజ మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో జాతి పోరాటాలు చేస్తున్న విప్లవకారులతో చర్చలు జరిపిన చరిత్ర ఉన్నప్పటికీ, ప్రస్తుతం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. కార్పొరేట్‌ శక్తులు విప్లవకారులను చంపేయాలనే అనే కండిషన్‌ పెట్టడంతోనే ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి ఈ హత్యాకాండ జరుపుతోందని ఆరోపించారు. ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరగాలని పౌర సమాజం నుంచి ఆకాంక్ష బలంగా వ్యక్తమతోందన్నారు. అయితే, దీన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని చంపేయడమే తమ లక్ష్యమని స్పష్టంగా మాట్లాడుతోందని విమర్శించారు. ఆదివాసీ, గిరిజన ప్రజలపై జరుపుతున్న యుద్ధం గురించి, మావోయిస్టు పార్టీ నాయకులను హత్య చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండ కట్టేందుకు సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎన్జీవో కల్యాణ మండపంలో జరిగే సదస్సులో విద్యార్థి ఉద్యమం నుంచి విప్లవోద్యమంలోకి వెళ్లిన మావోయిస్టు పార్టీ నాయకులు నంబాల కేశవరావు, లక్ష్మీ వెంకట నరసింహారావు, చలం తదితర విప్లవ నాయకుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీల ప్రాథమిక హక్కులైన జీవించే హక్కు, తామున్న ప్రాంతంలోని భూమిపై హక్కులను కాలరాసేందుకు వేలాదిమంది పోలీసు, కేంద్ర ప్రభుత్వ దళాలతో భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. ఆలోచన పరులు, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement