
‘తల్లికి వందనం’లో కోతలు వద్దు
చీరాల అర్బన్: నిబంధనల పేరుతో తల్లికి వందనానికి కోతలు వద్దని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి కోరారు. సీపీఎం జిల్లా నాయకుల శిక్షణ తరగతులు రెండో రోజు ఆదివారం కొనసాగాయి. ఆమె మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా తల్లికి వందనం నగదును అర్హులైన విద్యార్ధులందరికీ నిబంధనలు సడలించి తల్లుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారందరికీ ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్ పొందిన వారందరికీ నగదు చెల్లించాలని కోరారు. స్కీం వర్కర్లు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలన్నారు. గత ప్రభుత్వం విధించిన షరతులను విమర్శించిన టీడీపీ ప్రస్తుతం అంతకుమించిన షరతులను విధించిందన్నారు. రూ.15 వేలలో రూ.2వేలు మినహాయించారని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఏడాది పాలన సుపరిపాలన అని కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజలని భాష, ప్రాంతం పేరుతో విడుగొడుతోందని.. రాష్ట్రాలు హక్కులను హరిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే ఏడాది పాలనలో కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న చంద్రబాబు, పవన్కళ్యాణ్లు నోరు మెదపకుండా మోదీ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నూతన మెడికల్ కాలేజీలు ప్రయివేటు పరం చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు కంపెనీలకు రెడ్ కార్పెట్ పరచడమే అని విమర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, ఎన్.బాబూరావు, సీహెచ్ మణిలాల్, జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య, టి.వెంకటేశ్వర్లు, ఎం.ఆంజనేయులు, తిరుమల, వసంతరావు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి