
కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు
లక్ష్మీపురం: తల్లికి వందనం పథకం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. కిరణ్ ఖండించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పడం సిగ్గుచేటని తెలిపారు. 2024–25 సంవత్సరానికి పథకాన్ని బురుడీ కొట్టించి తల్లిదండ్రుల్ని మోసం చేశారని విమర్శించారు. కరెంటు 300 యూనిట్లు వినియోగిస్తే అర్హులు కారనే నిబంధనలను గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారని, మరి ఇప్పుడు ఆయన అదే నిబంధన కొనసాగించడం శోచనీయమని పేర్కొన్నారు. ఫోర్ వీలర్ వెహికల్ నిబంధనలను తీసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఫీజు రియింబర్స్మెంట్కి లింకు పెట్టడం సరికాదని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.కవిత, ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు షంషీర్ సుభాని, ఎస్ఎఫ్ఐ నాయకులు గంగాధర్, సంతోష్, రవి, అర్జున్ పాల్గొన్నారు
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్