
క్రికెట్ పోటీల విన్నర్ కావూరు ప్రిన్స్ యూత్ జట్టు
చిలకలూరిపేట టౌన్: కావూరు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. కావూరు–అప్పాపురం మార్గంలో ఈ నెల 3న ప్రారంభమైన ఈ టోర్నీలో జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 35 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. సెమీ ఫైనల్స్లో విజేతలైన జట్లు ఫైనల్స్లో హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో కావూరు జట్టు విజేతగా నిలవగా, ఇర్లపాడు జట్టు రన్నర్గా సత్తా చాటింది. బసికాపురం జట్టు మూడో స్థానంలోనూ, డేంజర్బోయ్స్ లోకల్ కావూరు జట్టు కన్సోలేషన్ బహుమతిని సాధించింది. విజేత కావూరు ప్రిన్స్ యూత్ జట్టుకు రూ. 20,116 నగదు బహుమతిని జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యుడు జెర్రిపోతుల బుల్లిబాబు అందజేయగా, ద్వితీయ స్థానం సాధించిన ఇర్లపాడు జట్టుకు రూ. 15,116 నగదు బహుమతిని విఘ్నేశ్వర పాలకేంద్రం వాసు ప్రదానం చేశారు. మూడో స్థానంలో నిలిచిన విజేతలకు రూ.10,116, కన్సోలేషన్కు రూ.7,116 నగదు అందించారు. మాజీ ఏపీజీ దాసరి చిట్టిబాబు మాట్లాడుతూ క్రీడా పోటీల నిర్వహణతో యువతకు శారీరక, మానసిక వికాసంతో పాటు పల్లె ప్రజల మధ్య సత్సంబంధాలు, సామాజిక ఐక్యత మరింత బలపడతాయని తెలిపారు. క్రీడా నిర్వాహకులను ఆయన ప్రశంసించారు.