కలికిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని కలికిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల వ్యవసాయ డిప్లమో, అగ్రికల్చర్ ఇంజనీరింగ్(3సం.లు) కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆర్.లక్ష్మీప్రసన్న తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని, పదో తరగతి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21 తేదీ లోగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏఎన్జీఆర్ఎయు.ఏసీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండేళ్ళ డిప్లమో కోర్సులో 34 సీట్లు, అగ్రికల్చర్ ఇంజినీరింగ్కు 30 సీట్లు ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు 8008554448 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
వ్యవసాయ డిప్లమో కోర్సులకు..
పుంగనూరు: స్థానిక వ్యవసాయ పాలిటెక్నిక్లో రెండు సంవత్సరాల కోర్సుకు సంబంధించి అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఎటువంటి రుసుం లేకుండా ప్రవేశం పొందవచ్చని తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్లో వివరాలు పొందుపరచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల పని వేళల్లో సంప్రదించాలని తెలిపారు.
ఉచిత ప్రవేశాలకు రెండో విడత జాబితా విడుదల
మదనపల్లె సిటీ: ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం రెండో విడత లాటరీ ఫలితాల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ తెలిపారు. జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 156 మంది విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎంపికై న వారి వివరాలను తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించడంతో పాటు https://cse.ap.gov. in/ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మొదటి విడతలో 465 మందికి సీట్లు కేటాయించగా, అందులో 386 మంది ఇప్పటికే పాఠశాలల్లో చేరినట్లు చెప్పారు. రెండోజాబితాలో ఎంపికై న విద్యార్థులు తమ ఆధార్కార్డు, తల్లి లేదా తండ్రి ఆధార్కార్డు, ఆదాయ, కులధృవీకురణ పత్రాలు, విద్యార్థి జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, తోబుట్టవుల ఆధార్, స్టడీ సర్టిఫికెట్ తదితర అవసరమైన పత్రాలతో ఈనెల 17వతేదీలోగా సంబంధిత పాఠశాలలకు హాజరై ప్రవేశాన్ని నిర్థారించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు టోల్ఫ్రీ నంబర్ 18004258580లో సంప్రదించాలని తెలిపారు.
తిరుపతి–చాప్రా మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : వేసవి రద్దీని పురస్కరించుకుని తిరుపతి–చాప్రా మధ్య ప్రత్యేక రైలును నడపుతున్నారని కడప రైల్వేకమర్షియల్ మేనేజర్ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ రాత్రి 11.55 గంటలకు ఈ రైలు (07433) తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి,డోన్, కర్నూలు, గద్వాల్, వనపర్తిరోడ్డు, మహబూబ్నగర్, షాద్నగర్, కాచిగూడ, మల్కాజ్గిరి, కామారెడ్డి, నిజామాబాద్, ముడ్కేడ్, నాందేడ్, పూర్ణ, హింగోలి, వాషిమ్, అకోల, మల్కాపూర్, ఖాడ్వా, ఇట్సాసి, భూపాల్, బిన, లక్ష్మీభాయిజాన్సీ, ఓరాయి కన్పూర్, లక్నో, అయోధ్య కెంట్, అయోధ్యమ్, బస్తీ, గోరక్పూర్, సిజ్వాన్ మీదుగా చాప్రాకు 10వ తేది ఉదయం 7.45 గంటలకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 12వ తేదీ ఉదయం 5.00 గంటలకు చాప్రాలో బయలుదేరి 14వ తేది మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి చేరుతుందని తెలిపారు.
మలేరియా ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
లక్కిరెడ్డిపల్లి: గ్రామాల్లో మలేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. శుభ్రతతో వ్యాధులు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహచ్ఓ, ఎంపీహెచ్ఎస్ మహమ్మద్ బాషా, జిల్లా మలేరియా ఆఫీసర్ జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.


