కడప అర్బన్: ‘ఆపరేషన్ మొబిట్రాక్’ద్వారా కడప జిల్లా సైబర్ క్రైమ్ టీం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణా పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్న్లో సఫలమయ్యారు.సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, మొత్తం 505 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ. 70 లక్షలు. ఇప్పటి వరకు 8 విడతల్లో మొత్తం రూ.11,76,00,000/– విలువైన 5877 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు వైఎస్సార్కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలియజేశారు. వైఎస్ఆర్ జిల్లాలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్ల ఐఏంఈఐ ఆధారిత ట్రాకింగ్ , డేటా అనలిటిక్స్ పద్ధతుల ద్వారా ఫోన్లు త్వరితగతిన రికవరీ చేశారు. మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కాకినాడ జిల్లా మంచి ప్రగతి సాధించినట్లు ఎస్పీ తెలిపారు.
పోలీసుల సూచనలు:
● సైబర్ మోసాల నుండి రక్షణ కోసం, అపరిచిత వీడియో కాల్స్ లేదా ఫిషింగ్ కాల్స్ / ఇమెయిల్స్కు ప్రతిస్పందించ వద్దు.
● సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా సమీపంలో గల పోలీస్ స్టేషన్ సంప్రదించాలి లేదా ఎన్సీఆర్పీ వెబ్సైట్లో ఫిర్యాధు చేయండి.
● మొబైల్ మిస్ అయినప్పుడు (లేదా) దొంగతనం జరిగినప్పుడు బ్యాంకు ఖాతాలను తక్షణమే బ్లాక్ చేయించాలి. సిమ్ కార్డ్ నెంబర్ను ఆలస్యం చేయకుండా డిసేబుల్ చేయించుకోవాలి.
● గూగుల్పే, ఫోన్పే వంటి యాప్లకు, అప్లికేషన్లను 2–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ సెక్యూరిటీ వినియోగించాలి.
● మొబైల్ పోయిన తక్షణమే గూగుల్ / ఆపిల్ ఐడీ, బ్యాంకింగ్ యాప్స్, వాట్సాప్, మెయిల్, సోషల్ మీడియా వంటి వాటి పాస్వర్డ్లు మార్చాలి.
● ఆండ్రాయిడ్ ఫోన్లకు, ఫైండ్ మై డివైస్, ఐఫోన్లకు, ఫైండ్ మై ఐ ఫోన్ (ఐ క్లౌడ్) ద్వారా ఫోన్న్ను ట్రాక్ చేయడం, రింగ్ చేయడం, లాక్ చేయడం, లేదా డేటా డిలీట్ చేయడం చేయొచ్చు. సీఈఐఆర్.జీవోవి.ఐఎన్ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్ వివరాలతో ఫిర్యాదు చేయవచ్చు.
సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు జాగ్రత్త..
ఫోన్ బిల్లు, సెల్ ఫోన్ బాక్స్, ఫోన్ అమ్మే వ్యక్తి గురించి పరిశీలించాలి. అపరిచితుల నుంచి ఫోన్లు కొనుగోలు చేయడం ద్వారా సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉంది. జిల్లా లో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించడంతో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, సైబర్ క్రైమ్ టీం ఇన్స్పెక్టర్ ఏ. మధు మల్లేశ్వర రెడ్డి, సంబంధిత సిబ్బందిని అభినందించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ , అడిషనల్ ఎసీప కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పి ఎన్. సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ యు. సదాశివయ్య పాల్గొన్నారు.


