పీలేరు రూరల్: కేవీపల్లె మండలం తీతవగుంటపల్లె పంచాయతీ పాతవడ్డిపల్లెలో ట్రాన్స్ఫార్మర్ తరలింపు విషయమై కొందరు గొడవపడి ప్రాక్టీస్ న్యాయవాది పూజారి యల్లయ్యను హత్య చేశారని రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో పాతవడ్డిపల్లెలో ట్రాన్స్ఫార్మర్ తరలింపు విషయమై అదే గ్రామానికి శ్రీనివాసులు వర్గీయులు కర్రలు, రాళ్లతో యల్లయ్యపై దాడి చేశారని తెలిపారు. అడ్డు వచ్చిన యల్లయ్య తల్లి రెడ్డెమ్మ, తండ్రి వెంకటరమణపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. యల్లయ్య సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, గాయపడ్డ రెడ్డెమ్మ, వెంకటరమణను చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్కు తరలించినట్లు తెలిపారు. తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు పూర్వ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు, సమాన హాదాల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కోసం సవరించబడిన తాత్కాలిక సీనియారిటీ జాబితా కార్యాలయ అధికారిక వెబ్ సైట్ https://rjdsekadapa.blogspot. comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. ఉపాధ్యాయులు తమ సర్వీసు వివరాలు, సినియారిటీ స్థానాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. తమ సర్వీస్ వివరాలు లేదా సీనియాటికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆధార పత్రాలతో rjdsekadapa@apschool edu.inద్వారా ఈ నెల 11వ తేదీ లోగా సమర్పించాలని పాఠశాల విద్య ఆర్జేడీ తెలిపారు.


