వైఎస్ కుటుంబ హయాంలోనే రాయచోటి అభివృద్ధి
రాయచోటి అర్బన్ : వైఎస్ కుటుంబ హయాంలోనే రాయచోటి ప్రాంతంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో రాయుడు కాలనీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ, ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో శాశ్వత అభివృద్ధి పనులు జరిగాయన్నారు. వెలిగల్లు, శ్రీనివాసపురం, ఝరికోన ప్రాజెక్టులు, రాయచోటికి రింగ్ రోడ్డు, పట్టణానికి శాశ్వత తాగునీటి సదుపాయం , అన్ని గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు నిర్మించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేసిన ఘనత అప్పటి సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయంతో పాటు 95 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి , టీటీడీ కల్యాణమండపం , ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం, మున్సిపల్ సభా భవనం, 4 ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు, రహదారుల విస్తరణ, డైట్ హాస్టల్లో మున్సిపల్ పార్కు, మాండవ్య ఎకోపార్కుల అభివృద్ధి గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలిపారు. రాయచోటి మున్సిపాలిటీని గ్రేడ్ 1 నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయించామని తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో ఒక కొత్త పింఛన్ కుడా రాలేదని గుర్తు చేశారు. ఇలా మహిళలతో పాటు రైతులన , అన్ని సామాజిక వర్గాల వారిని కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిమి హరూన్ బాషా, కౌన్సిలర్లు చంద్రశేఖర్, షబ్బీర్, గౌస్ ఖాన్, మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి విజయ భాస్కర్, గోపాల్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రెడ్డెయ్య, ట్రేడ్ యూనియన్ నాయకులు అశోక్, వెంకట్రామిరెడ్డి, యూత్ అధ్యక్షుడు ఇంతియాజ్, టూరిజం శాఖ మాజీ డైరెక్టర్ కొత్తిమీర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్ రెడ్డి


