సమసమాజ స్థాపనకు కనకదాస సేవలు ఆదర్శనీయం
రాయచోటి: సామాజిక సంస్కర్త, కవి శ్రీ భక్త కనకదాస జయంతిని జిల్లా పోలీసులు శనివారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కనకదాస చిత్రపటానికి అదనపు ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ కనకదాస తన కీర్తనలు ద్వారా సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను, అసమానతలను నిర్భయంగా ప్రశ్నించారన్నారు. కనకదాస స్ఫూర్తిని కొనసాగిస్తూ పోలీసులు కూడా సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా అట్టడుగు వర్గాలకు కూడా సత్వర న్యాయం అందించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ (అడ్మిన్) విజె రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని భక్త కనకదాస సేవలను స్మరించుకున్నారు.
కనకదాస చూపిన బాటలో నడుద్దాం
భక్త కనకదాస చూపిన బాటలో నడుద్దామని కురబ సంక్షేమ, అభివృద్ధి సంఘం నాయకులు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి నాగేంద్ర రాజు పేర్కొన్నారు. శనివారం భక్త కనకదాస జయంతి సందర్భంగా రాయచోటి కలెక్టరేట్లో కురబ సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమం, వివిధ శాఖల జిల్లా అధికారులు భక్త కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు వెంకటరమణ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి నాగేంద్ర రాజు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దామోదర్ రెడ్డి, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కురుబ సంఘం నాయకులు రఘునాథ్ పాల్గొన్నారు.


