సాక్షి, కృష్ణా జిల్లా: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుంది ఏపీ పోలీసుల తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. జుజ్జువరపు సుప్రియపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారు. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి.. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా అని పోలీసులకు పేర్ని నాని సవాల్ విసిరారు.
మాజీ మంత్రి పేర్నినాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రియను మేం జైలులో పరామర్శించాం. బాధితురాలు చెప్పిన విషయాలపై నేను మీడియాతో మాట్లాడాను. పామర్రు సీఐ సుభాకర్, ఎస్ఐ భాస్కర్, హోంగార్డు కోటేశ్వరమ్మ ఎలా సుప్రియపై దాడి చేశారో చెప్పాను. బాధితురాలకి న్యాయం చేయాలని ఎస్పీని కోరాను. కానీ, తెల్లవారుజామున 3 గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి ఒక అశరీరవాణి విడుదల చేశారు. ప్రకటన పంపించడాన్ని మేం తప్పుపట్టడం లేదు. కానీ సంతకం లేకుండా ప్రకటన ఇచ్చారు. ఎవరో ఒకరు సంతకం పెట్టి ప్రకటన ఇవ్వాల్సింది. పోలీసులు సుప్రియపై దాడి చేయలేదని అశరీరవాణి ప్రకటనలో చెబుతున్నారు. సుప్రియ శరీరం పై ఎలాంటి రక్త గాయాలు లేవని వైద్యులు చెప్పారట. 108 సిబ్బంది కూడా ఎలాంటి గాయాలు లేవని సుప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లలేదని చెబుతున్నారు. పోలీసులు అంతా చెడ్డవారని నేను చెప్పడం లేదు. దుర్మార్గంగా వ్యవహరించే వారి పేర్లనే మేం చెబుతున్నాం.
రాజకీయ నాయకుడు లెటర్ ఇస్తే కానీ కేసులు కట్టే పరిస్థితి లేదు. 21వ తేదీన సుప్రియ, ఆమె తల్లిదండ్రులు పామర్రు స్టేషన్ కు వెళ్లారు. 21వ తేదీన స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ను మీడియాకు విడుదల చేయండి. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి. అలా చేస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటా. నేను మాట్లాడిన ప్రతీ మాట వెనక్కి తీసుకుంటా.. పోలీసు సిబ్బందికి క్షమాపణ చెబుతాను. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టా. రేపు 11:30 గంటల లోపు మీరు ఆధారాలను బయటపెట్టండి. సుప్రియ సోదరుడు తేజ దొంగతనం చేస్తున్నట్లు సీసీ కెమెరా ఆధారాలున్నాయంటున్నారు. తేజకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టండి. పామర్రు నియోజకవర్గం పేకాటకు నిలయంగా మారింది. ఆశ్రమం ఏరియాలో పేకాట శిబిరంపై దాడి చేసి పోలీసులు లక్షా 60 వేలు వసూలు చేశారని సమాచారం

మూడు నక్షత్రాలు ఉన్న అధికారి ఏలూరు నుంచి వచ్చిన కొంతమంది నిర్వాహకులతో డీల్ చేసుకున్నాడా లేదా?. కైలే అనిల్తో మాట్లాడమని ఏలూరుకు చెందిన ఓ మిత్రుడు నన్ను అడిగారు. అనిల్ కుమార్ దమ్ముగా రాజకీయం చేసే వ్యక్తి. డబ్బుకు కక్కుర్తి పడే రకం కాదు. నాకు కులమతాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలుసుకోవాలి. పోలీసులకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే పరిస్థితి సామాన్యులకు ఉంటుందా?. ఆసుపత్రికి తీసుకెళ్లనని 108 సిబ్బంది ఎప్పుడైనా లిఖితపూర్వకంగా రాసివ్వడం చూశామా. కానీ సుప్రియ కేసులో 108 సిబ్బంది రాసిచ్చారు అని అన్నారు.


