సాక్షి, తాడేపల్లి: దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు భారతీరాజా అని ప్రశంసలు కురిపించారు. ఆయన మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు.
భారతీరాజా మృతి పట్ల వైఎస్ జగన్ స్పందిస్తూ..‘భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా అనేక తరాల సినీ అభిమానులను ప్రభావితం చేశారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో విశిష్ట పాత్రలు పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. భారతీరాజా మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు ప్రగాఢ సానుభూతి. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి’ అని వ్యాఖ్యానించారు.


