స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

YS Jagan Mohan Reddy Video Conference With Collectors Over Spandana - Sakshi

జీవోలో పేర్కొన్న దానికంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవు

సాక్షి, తాడేపల్లి: కోవిడ్‌ చికిత్సలకు అధిక రేట్లు వసూలు చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం సీఎం జగన్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దాని కంటే.. కోవిడ్‌ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలన్నారు. కోవిడ్ బాధితుడికి అరగంటలోగా బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని తెలిపారు. 104, 14410 కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వరదలు, సహాయక చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.  గోదావరి, కృష్ణా నదిలో వరదలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. సెప్టెంబర్ 7లోగా పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని.. గోదావరి వరద ముంపు బాధితులకు 2 వేల రూపాయల అదనపు పరిహారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: వరద ముప్పు తప్పించడానికే నీటి మళ్లింపు)

దానితో పాటు రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌కు అదనంగా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పామాయిల్‌, కేజీ ఉల్లి.. కేజీ బంగాళదుంపలు, 2 లీటర్ల కిరోసిన్‌ ఇవ్వాలన్నారు. సెప్టెంబర్ 7లోగా నిత్యావసరాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ వసతులు దెబ్బతిన్న చోట వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో రోగాలు రాకుండా మందులు అందుబాటులో ఉంచుకోవాలని.. వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండల స్థాయిలో నిత్యావసరాలను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి వసతుల క్లోరినేషన్ కోసం చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top