సాక్షి, తాడేపల్లి: ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలన్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేస్తాడో మన అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూశాం. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేయడం చూశాం. బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇన్ని ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.
చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ దీటుగా నిలబడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలి. విజయమైనా, పరాజయమైనా.. తన ఎమ్మెల్యే కేండిడేట్ తనకు అండగా ఉన్నాడు అని ప్రతి కార్యకర్తకూ కలగాలి. చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ అండగా నిలబడ్డాడని కార్యకర్తకు అనిపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే, వాళ్లే మీకు జనరల్ ఎన్నికల్లో బలగంగా నిలబడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. దాన్ని సీరియస్గా తీసుకుంటాను. అలా జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి ఫెయిల్యూర్గానే భావిస్తాను. ప్రజల్లో నిరంతరం ఎవరు ఉన్నారు? పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో, ఇప్పటికే మీకందరికీ అవగాహనకు వచ్చి ఉంటుంది.
అలాంటి వారిని గుర్తించి, పోటీకి సన్నద్ధం చేయండి.
స్థానిక ఎన్నికల సమయం వచ్చే సరికి, చంద్రబాబు పరిపాలనా వైఫల్యాలను మన పార్టీ గ్రామ, వార్డు స్థాయి యంత్రాంగం ద్వారా, ప్రతి ఇంటికీ ఈ బుక్లెట్ మెటీరియల్ ద్వారా ప్రజలను జాగృత పరచాలి. రెండేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశాం. కమిటీ సభ్యులు అందరికీ కూడా వెన్నుపోటు రెండేళ్లు కాపీలు అందేలా చూడండి. ఈ బుక్లెట్ ప్రతీ ఇంటికీ చేరేలా చూడాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలి. చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లపై ప్రజలు తిరగబడతారు’ అని తెలిపారు.


