సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేతలు రెచ్చిపోయి బరితెగింపు చర్యలకు దిగారు. ఇందులో భాగంగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కేసులో ఇరికించేందుకు మార్ఫింగ్ ఫొటోలను విడుదల చేశారు. ఓ కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని పెద్దారెడ్డి అనుచరుడిగా కుట్ర చేస్తూ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వివరాల మేరకు.. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం తాడిపత్రిలో 400 బాటిళ్ల గోవా లిక్కర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పుట్లూరు మండలం చింతలపల్లికి చెందిన రామాంజినేయరెడ్డి అనుమానితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అనుమానితుడిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచురుడిగా చూపించేందుకు పచ్చ నేతలు కుట్రకు తెరలేపారు. నిందితుడు.. పెద్దారెడ్డి పక్కనే ఉన్నట్టుగా జేసీ వర్గీయులు ఫొటో క్రియేట్ చేశారు. అనంతరం, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అయితే, పచ్చ నేతల కుట్రలకు వైఎస్సార్సీపీ చెక్ పెట్టింది. దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోను తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్త స్థానంలో మరో వ్యక్తి ఫోటో మార్ఫింగ్ చేసి.. పెద్దారెడ్డిపై దుష్ప్రచారం చేసినట్టు ఆధారాలు చూపించింది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేతల మార్ఫింగ్ వ్యవహారంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


