సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గాలికొదిలేసి.. ప్రచార ఆర్భాటాల కోసం టీడీపీ బృందం హస్తిన బాట పట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సోమవారం విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, టీడీపీ కూటమి ఎంపీల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు వారంతా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
బాబును పొగిడారంటూ ప్రచారం
భేటీ అనంతరం టీడీపీ వర్గాలు తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం చంద్రబాబును రాష్ట్రపతి ‘ఇంటెలిజెంట్, విజనరీ’ అని ప్రశంసించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం గొప్ప విషయమని రాష్ట్రపతి అన్నట్టుగా లోకేశ్ బృందం ప్రచారం చేస్తోంది.
రాష్ట్రపతితో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. ఎప్పటి మాదిరిగానే వైఎస్సార్సీపీపైన, మాజీ సీఎం వైఎస్ జగన్ పైన విమర్శలు గుప్పించారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని వైఎస్సార్సీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఐదు కోట్ల ఆంధ్రులను అవమానిస్తోందంటూ అక్కసు వెళ్లబోశారు.


