సాక్షి,వైఎస్సార్ జిల్లా: రాజ్యసభ సీట్ల విషయంలో టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. లాబీయింగ్ చేసే వారికే అవకాశాలుంటాయని ఆ పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి మొండిచేయి చూపిస్తున్నారని మండిపడుతున్నారు.
రాజ్యసభ సీటు రాకపోవడంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, టీడీపీ రాయలసీమ జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి అలకబూనారు. సోషల్ మీడియాలో శ్రీనివాసులురెడ్డి అసంతృప్తిని వెళ్లగక్కారు. 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోలేదు. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి మొండిచేయి చూపించింది. కష్టపడిన నేతలకు గుర్తింపు లేదంటూ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. కాగా, ఇటీవలే ఆయనకున్న పోలిట్ బ్యూరో సభ్యుడి పోస్ట్ తీసేసి జోనల్ కో ఆర్డినేటర్ స్థాయికి తగ్గించింది.


