సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం కొత్తపూడి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల అనుమతి లేకుండా పోర్ట్ పేరుతో విద్యుత్ టవర్ల ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేశారు. ఇవాళ(మే 28, గురువారం) వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘1994-95లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూమి ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పట్టాలన్నింటినీ ఫ్రీ హోల్డ్ గా మార్పు చేశారు. పోర్టు అవసరాల కోసం ఆ పొలాల్లో హెవీ విద్యుత్ లైన్ టవర్లను వేయడానికి అధికారులు మార్కింగ్ చేశారు. రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల వల్ల తమ భూమికి విలువ లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.
‘‘విద్యుత్ లైన్ టవర్లు వేయాలనుకుంటే ఈ పొలాలన్నింటినీ పూర్తిగా కొనుగోలు చేసి నష్టపరిహారం ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను సేకరించినా రైతులకు సంతోషకరమైన పద్ధతిలోనే పరిహారాన్ని అందించాం. కొత్తపూడి గ్రామ రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు.


