జిన్నాటవర్కు జాతీయ జెండా రంగులు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నడిబొడ్డులో ఉన్న జిన్నాటవర్కు జాతీయ జెండా రంగులు అద్దారు. దీంతో గత కొద్ది రోజులుగా బీజేపీ నాయకులు జిన్నాటవర్పై చేస్తోన్న మత రాజకీయాలకు తెరపడినట్టయింది. నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం ఉదయం నుంచి జిన్నాటవర్కు జాతీయ జెండాలోని రంగులను వేసి సాయంత్రానికి పూర్తి చేశారు.
ఇప్పటికే జిన్నాటవర్ చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. జెండా ఎగురవేసేందుకు దిమ్మెలను తయారు చేస్తున్నారు. రూ.5 లక్షలతో జిన్నాటవర్ సెంటర్ను సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జిన్నాటవర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసేందుకు పాలకవర్గంతో, అధికారులు సంసిద్ధమయ్యారు.