సాక్షి, అమరావతి: ‘ఒక్క పాపను కనిపెట్టలేని వారు..30 వేల మంది మహిళలు, చిన్నారులను వెతికి తీసుకువస్తారా..వాళ్లందరి సంగతి సరేగానీ ముందు ఈ ఒక్క చిన్నారిని వెతికి తీసుకురండి’ అంటూ చంద్రబాబు ఎన్నికల ముందు ఏపీలో 30 వేల మంది మహిళలు, చిన్నారులు మిస్సయ్యారంటూ రోజూ గగ్గోలు పెట్టిన కూటమి నేతలు, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మహిళలకు భద్రత లేదంటూ గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్లు..ఇప్పుడు జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
అవన్నీ రాజకీయ ఆరోపణలే కదా...
కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి(2) కనిపించకుండాపోయి రెండు వారాలు అయ్యింది. చిన్నారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదంటూ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికత, కట్టుదిట్టమైన పోలీసింగ్ ఉందంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం..ఒక చిన్నారి జాడ కూడా కనిపెట్టలేకపోవడం దారుణమని మండిపడుతున్నారు.
ఎన్నికల ముందు ‘‘రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు, చిన్నారులు మిస్సయ్యారు.. వారందరినీ వెతికి తీసుకొస్తాం’’ అని చెప్పిన కూటమి నేతలు, ఇప్పుడు ఆ మాటలను ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చిన్నారి కేసులోనే ఫలితం లేకపోవడంతో, 30 వేల మంది గురించి చేసిన ప్రకటనలు కేవలం రాజకీయ ఆరోపణలేనని తేలిపోయిందని స్పష్టం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను నేరుగా ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


