దేవాలయాల విలువైన స్థలాల్లో ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి పచ్చజెండా
ఏడు ప్రధాన ఆలయాల వద్ద స్థలాలను గుర్తించాలంటూ ఈవోలకు ఆదేశాలు
చంద్రబాబు సీఎం అయిన మూడు నెలలకే ఆలయాల భూములపై గురి
ఇప్పటికే భక్తులకు అన్ని సదుపాయాలతో గదులు ఉన్నా ప్రైవేట్ హోటళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను ప్రైవేట్ పరం చేసేస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా దేవాలయాలకు చెందిన విలువైన ఆస్తులపై దృష్టి సారించింది! ప్రముఖ దేవాలయాలకు చెందిన అత్యంత విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ.. పవిత్ర ప్రాంగణాల్లో వ్యాపార కార్యకలాపాలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపింది! ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి అనుమతించడం ద్వారా విచ్చలవిడి ధోరణికి తెర తీస్తోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే 2024 ఆగస్టు 27న పెద్ద ఆలయాల పరిసరాల్లో ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇటీవల ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ దేవుడు భూములను 33 ఏళ్ల పాటు లీజుకిచ్చేందుకు స్థలాలను గుర్తించాలంటూ దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈవోలను ఆదేశించారు.
ఆరు ఆలయాల వద్ద..
మద్యం, మాంసం సరఫరా జరిగే ప్రైవేట్ హోటళ్లను ఆలయాల వద్ద అదికూడా దేవుడి భూములను లీజుకిచ్చి అనుమతించడం పట్ల దేవదాయశాఖ వర్గాలు విస్తుపోతున్నాయి. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల వద్ద అర ఎకరం నుంచి ఎకరం చొప్పున ప్రైవేట్ హోటళ్లకు లీజుకిచ్చేందుకు స్థలాలను గుర్తించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశించారు. అ
యితే వీటిల్లో విజయవాడ దుర్గ గుడి మినహా మిగిలిన ఆరు చోట్ల భక్తుల కోసం ఆయా ఆలయాల నిధులతో నిరి్మంచిన గదులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో చోట వందకు పైగా అద్దె గదులున్న దేవాలయాలున్నాయి. భక్తులకు అన్ని రకాల వసతులతో ఏసీ గదులు అందుబాటు ధరలో ఉన్నాయి. అయినప్పటికీ వీటిని కాదని ప్రైవేట్ హోటళ్ల నిర్మాణాలకు అనుమతించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
వేలం లేకుండా కావాల్సిన వారికి కట్టబెట్టేందుకే..!
దేవదాయశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, సత్రాల పేరిట 4.45 లక్షల ఎకరాల భూములు ఉండగా 2.11 కోట్ల చదరపు గజాలు (4,355 ఎకరాలు) ఖాళీగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుంది. 33 ఏళ్ల లీజుకు అప్పగించడం అంటే హోటళ్ల నిర్మాణం జరిగాక ఇక ఆ భూములు తిరిగి దేవాలయాల ఆ«దీనంలోకి వచ్చే పరిస్థితి ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది. వేలం విధానంలో కాకుండా లీజు ద్వారా కేటాయించడంతో టీడీపీ పెద్దల సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని పేర్కొంటున్నారు.
2014–19 మధ్య కూడా చంద్రబాబు ఇదే రీతిలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధుల కోసమంటూ విశాఖ పరిధిలోని దేవదాయశాఖ భూములకు బేరం పెట్టింది. రూ.వంద కోట్లకు భూములను విక్రయించినా విజయనగరం మెడికల్ కాలేజీ నిర్మాణానికి కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయలేదు.


