విశాఖ: ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. రాధాకృష్ణ తప్పుడు కూతలపై శాంతియుత నిరసన చేపట్టామని అన్నారు. విశాఖలో ఇవాళ ఆయన నిరసనలో పాల్గొని మాట్లాడారు.
‘దేశంలో అతిపెద్ద స్కాం అమరావతి. మావిగన్ అతిపెద్ద గ్రోత్ కారిడార్. అమరావతిలో 4 వేల రూపాయల ఖర్చు అయ్యే భవనాల చదరపు అడుగు నిర్మాణానికిరూ.14 వేలు ఖర్చు చేస్తున్నారు. జగన్ ది స్టేట్ ఇంట్రెస్ట్ అయితే చంద్రబాబు ది రియల్ ఎస్టేట్. కొత్త పలుకు కాదు చెత్త పలుకు.
మేము మీలాగా తప్పులు పనులు చేసి పదవులు పొందలేదు. నీ గురించి నీతోటి జర్నలిస్టులను అడిగితే చెబుతారు. జర్నలిస్ట్ స్థాయి నుంచి కంపెనీకి అధిపతివి ఎలా అయ్యావు? ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు, నువ్వు పెన్నుపోటు పొడిచావు’ అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘రాధాకృష్ణవి నీచమైన రాతలు. రాధాకృష్ణ పాపం పండింది. అందుకే ఇలాంటి రాతలు రాశాడు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. బాబు, లోకేష్ మెప్పు కోసమే రాధాకృష్ణ ఇలాంటి రాతలు రాస్తున్నాడు. రాధాకృష్ణ రాతలు చూసి చంద్రబాబు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో మహిళలకు క్షమాపణ చెబుతూ వార్త రాయాలి’ అని అన్నారు.
మావిగన్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం మహిళలపై పిచ్చి రాతలు రాశారని చెప్పారు. రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందని తెలిపారు. జర్నలిజం విలువలను రాధాకృష కాలరాశారని అన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని తెలిపారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


