మళ్లీ అదే డైవర్షన్‌ కుట్ర | Chandrababu Govt same diversion conspiracy again | Sakshi
Sakshi News home page

మళ్లీ అదే డైవర్షన్‌ కుట్ర

May 28 2026 6:16 AM | Updated on May 28 2026 6:16 AM

Chandrababu Govt same diversion conspiracy again

కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లింపే లక్ష్యం 

అందుకే విచారణ పేరుతో సిట్‌ హడావుడి 

కేఎన్‌ఆర్‌ను విచారించిన సిట్‌ 

అబద్ధపు వాంగ్మూలాలతో దుష్ప్రచారమే లక్ష్యం

సాక్షి, అమరావతి: చంద్రబాబు తన మార్కు డైవర్షన్‌ రాజకీయాలకు మరోసారి తెరతీశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల అవినీతి, అసమర్థ పాలనపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పన్నాగం పన్నారు. అందుకు టీడీపీ వీరవిధేయ అధికారులతో ఏర్పాటు చేసిన సిట్‌ను మరోసారి అస్త్రంగా చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు విచారణకు సంబంధించి సిట్‌ ఒక్కసారిగా హడావుడి చేయడమే అం­దు­కు నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీజీపీ కార్యాలయం, సిట్‌ అధికారులు చకచకా కుట్ర కార్యాచరణ చేపట్టారు. కె.నాగేశ్వర్‌ రెడ్డి(కేఎన్‌ఆర్‌)ని సిట్‌ అధికారులు బుధవారం విచారించడం ఆ కుతంత్రంలో భాగమే. ఆయన్ను విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విచారించారు.   

పోరుబాటకు జడిసి డైవర్షన్‌ రాజకీయం 
టీడీపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ పోరుబాటకు సిద్ధపడుతోంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ నిర్దేశించారు. ఈ సమావేశం నిర్వహించనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. దాంతో బెంబేలెత్తిన ప్రభుత్వ పెద్దలు డైవర్షన్‌ కుట్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే కేఎన్‌ఆర్‌ను బుధవారమే విచారించాలని నిర్ణయించారు. తదనంతరం కూడా ఈ విచారణ పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలను వేధించాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగమన్నది స్పష్టమవుతోంది. ఈ విచారణ ప్రక్రియను వక్రీకరిస్తూ.. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ దు్రష్పచారానికి పాల్పడాలన్నదే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కుతంత్రాలను తిప్పికొడుతూ ఉద్యమ పథంలో సాగుతామని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది.  

ఇదీ సిట్‌ పన్నాగం 
మద్యం విధానంపై అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పోలీసు జులుం ప్రదర్శిస్తోంది. ఈ కేసులో విచారణ పేరుతో పలువురు అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులను వేధించి వెంటాడింది. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వేధించింది. వారు చెప్పని విషయాలు చెప్పినట్టుగా వాంగ్మూలాలు నమోదు చేసింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, రిటైర్డ్‌ అధికారి కృష్ణమోహన్‌ రెడ్డి, వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప, రాజ్‌ కేసిరెడ్డి తదితరులను అక్రమంగా అరెస్టు చేసింది. 

అయినా సరే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు చూపించలేక పోయింది. ఈ కేసులో అక్రమంగా అరెస్టు అయిన అందరికీ బెయిల్‌ మంజూరైంది. దాంతో ప్రభుత్వం కుట్ర పూరితంగానే అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ఈ అక్రమ కేసు విచారణను తెరపైకి తేవడం గమనార్హం. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కేసు విచారణ పేరుతో హడావుడి చేయాలని పన్నాగం పన్నిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement