సాక్షి, అమరావతి: నాబార్డు నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్స్) రూ.3,762.26 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి షరతుల్లేని, మార్చలేని హామీకి లోబడి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్ల అమలు కోసం ఈ రుణాన్ని వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీఈపీడీసీఎల్కు రూ.1,294.87 కోట్లు, ఏపీసీపీడీసీఎల్కు రూ.1,162.86 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్కు రూ.1,304.53 కోట్లు కలిపి మొత్తం రూ.3,762.26 కోట్లు నాబార్డు నుంచి రుణం తీసుకుంటున్నట్లు వివరించారు. చంద్రబాబు సర్కారు ఇప్పటికే డిస్కమ్స్ పేరిట వివిధ బ్యాంకుల నుంచి విద్యుత్, బొగ్గు కొనుగోళ్ల పేరుతో రూ.5,473 కోట్ల అప్పులకు గ్యారెంటీ ఇచ్చింది. ప్రస్తుత రూ.3,762.26 కోట్లు కూడా కలిపితే డిస్కమ్స్ అప్పులు రూ.9,235.26 కోట్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినట్లయ్యింది.


