ఈసారైనా కరుణించేనా..? | AP looks towards the budget to be presented by Nirmala Sitharaman on Sunday | Sakshi
Sakshi News home page

ఈసారైనా కరుణించేనా..?

Feb 1 2026 4:59 AM | Updated on Feb 1 2026 4:59 AM

AP looks towards the budget to be presented by Nirmala Sitharaman on Sunday

గత బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపిన నిర్మలమ్మ  

బీహార్‌కు వరాలిచ్చి ఏపీని పట్టించుకోని కేంద్ర ఆర్థిక మంత్రి

ఎన్‌డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్నా ప్రయోజనం సున్నా  

ఢిల్లీలో ఉత్తుత్తి పర్యటనలే తప్ప సాధించిందేమీ లేదు

2024 – 25 కేంద్ర బడ్జెట్‌లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల అప్పు తప్ప రాష్ట్రానికి ఒనగూరిందేమీ లేదు. నిర్మలమ్మ వరాలన్నీ బీహార్‌కు ఇచ్చేస్తే సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు మౌనం వహించారు. కీలకమైన కేకే రైల్వే లైన్‌ లేకుండానే విశాఖ జోన్‌ ఏర్పాటు చేసేస్తున్నా నోరు మెదపలేకపోతున్నారు. 

రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులూ మౌనం వహిస్తున్నారు. కీలకమైన  కేకే లైన్‌తో కూడిన జోన్‌ ఏర్పాటుకు కేంద్రాన్ని డిమాండ్‌ చేయలేకపోతున్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో నేటికీ కేంద్ర పెద్దల నుంచి స్పష్టత సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. తరచూ ఢిల్లీ వెళ్తున్నా కేసుల ఎత్తివేతపైనే శ్రద్ధ పెడుతున్నారు తప్పా రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు.   

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ వైపు ఏపీ ప్రజానీకం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మొండిచేయి చూపిన నిర్మలమ్మ... ఈ సారైనా రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు అవసరమైన నిధులు కేటాయించి, కొత్త వరాలేమైనా ఇస్తారేమోనని ఉత్కంఠతో ఉన్నారు. తన వల్లే కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కాపాడడంలో, నిధులు సాధించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. 

గతేడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. అమరావతి కోసం అప్పు తప్ప సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ఏమీ సాధించలేకపోయారు.  సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నిత్యం ఢిల్లీ వచ్చి వెళ్తున్నా ఏపీకి ఒరిగింది శూన్యం. ఇప్పటి వరకు ప్రత్యేక విమానాల్లో 27 సార్లు ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయినా నిధులు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. 

ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ తన అనుకూల ఎల్లో మీడియాను పిలిపించుకోవడం... తనకు తోచింది చెప్పి డప్పు కొట్టించుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. రాష్ట్రానికి అది వచ్చేస్తోంది... ఇది వచ్చేస్తోంది అంటూ బాబు లీకులివ్వడం... వాటిని పట్టుకుని ఎల్లో మీడియా డప్పు కొట్టడం... ఇంతకు మించి రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనాలేం లేవని మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement