ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

Andhra Pradesh ICET ECET 2021 Results Out, Check Here Details - Sakshi

సాక్షి, అమరావతి: ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఐసెట్‌–2021, ఏపీ ఈసెట్‌ 2021 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11కి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 34,789(91.27శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్‌ ఫలితాల్లో 29,904 (92.53శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో ఐసెట్‌, 19న ఈసెట్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

విద్యార్థులు అడ్మిట్‌ కార్డు నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి  https://education.sakshi.com/ లో ఫలితాలు చూడవచ్చు.

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. రికార్డు స్దాయిలో ఏపీ ఇంజనీరింగ్ సెట్, ఐసెట్ ఫలితాలను ప్రకటిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఐసెట్‌కు 42 వేల ధరఖాస్తు చేసుకున్నారని, 38 వేలమంది హాజరవ్వగా, 34789 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. దాదాపు 91 శాతం మంది అర్హత సాధించారని, పరీక్షా ఫలితాలని రేపటి నుంచి విద్యార్దులకి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. 

అదే విధంగా ఏంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకి నిర్వహించిన ఐ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 19న ఏపీ ఇంజనీరింగ్ సెట్ నిర్వహిస్తే పది రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ సెట్ నిర్వహించిన ఆంద్రా యూనివర్సిటీకి అభినందనలు తెలియజేశారు.  త్వరలోనే ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాగా  త్వరలోనే లాసెట్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు.  రాష్ట్రంలోని అన్ని పీజీ ప్రవేశాలకి అన్ని యూనివర్సిటీలకి కూడా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. 

ఏపీఈసెట్‌ ఫలితాలు
ఇంజనీరింగ్‌ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఏపీఈసెట్‌–2021 (ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ(ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్‌ ఫలితాల వెల్లడి కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి హాజరు అయ్యారు. ఏపీఈసెట్‌కు మొత్తం 32,318 మంది విద్యార్థులు హాజరు కాగా, మొత్తం 13 బ్రాంచులకు గాను పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించారు. 

ఏపీ ఐసెట్‌-2021 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ఈసెట్‌-2021 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top