99 పైసలకు 20 ఎకరాల కేటాయింపు | Andhra Government Sells Over 20 Acres To TCS For 99 Paise | Sakshi
Sakshi News home page

99 పైసలకు 20 ఎకరాల కేటాయింపు

Apr 28 2026 5:55 AM | Updated on Apr 28 2026 5:55 AM

Andhra Government Sells Over 20 Acres To TCS For 99 Paise

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఎండాడలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌ కోసం సుమారు రూ.1,000 కోట్లకుపైగా విలువ కలిగిన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిఫ్ట్‌ పాలసీ 2024–29 ప్రకారం ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌కు మొత్తం 20 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భూమిలో ఇన్ఫోసిస్‌ రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడితో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

దీంతోపాటు ఎండాడ వద్ద సర్వే నెంబర్‌ 175/పీలో మరో 5 ఎకరాల భూమిని భవిష్యత్తు అవసరాలకు ఇన్ఫోసిస్‌కు కేటాయించడానికి ఏపీఐఐసీకి బదలాయించాలని రెవెన్యూశాఖను కోరింది. ఈ క్యాంపస్‌కు అవసరమైన మౌలికవసతులను రూ.79 కోట్లతో ఏపీఐఐసీ, వీఎంఆర్‌డీఏ కల్పించనున్నాయి.2029 జనవరి నాటికి తొలి దశ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆరేళ్లలో రెండు దశలను పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టుకు 100 శాతం గ్రీన్‌ఎనర్జీని అందించాలని ఇంధన శాఖను ఆదేశించింది. భూమి అమ్మకం ఒప్పందం కుదిరిన 120 రోజుల్లోగా అనుమతుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement