సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఉన్నపళంగా ఆ గ్రామాల్లో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. ఇది “కుట్ర రాజకీయాలే”నని చెబుతూ.. చంద్రబాబు సర్కార్కు రైతులు షాకిచ్చారు. గ్రామసభల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాజధాని ప్రాంత రైతులు మరోసారి తమ సమస్యలతో రోడ్డెక్కారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
తమ సమస్యలను నేరుగా మాజీ సీఎం వైఎస్ జగన్కు చెప్పుకోవడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనే హఠాత్తుగా పెనుమాకలో సీఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారింది. “రాజధానికి భూమి ఇవ్వాలి” అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్తో సమావేశం ఉన్న రోజే గ్రామసభ నిర్వహించడాన్ని రైతులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నంగా ఇది మారిందని, ప్రభుత్వ వైఖరి వేధింపులుగా ఉందని వారు మండిపడుతున్నారు.
అంతేకాదు.. గ్రామసభకు టీడీపీ నేతలను పిలవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు నీళ్లు నమిలారు. ఆపై చేసేది లేక టీడీపీ నేతలు, అధికారులు గ్రామసభ నిర్వహించకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ రైతులు వైఎస్ జగన్ను కలవబోతున్నారు.
మరోవైపు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “తొలి విడతలోనే భూములు ఇచ్చాం… మళ్లీ భూములు ఎలా ఇవ్వాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు లేకపోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమ బాధలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడం, మరోవైపు అదే సమయంలో గ్రామసభ నిర్వహణకు ముందుకు రావడం.. ఆ సభను రైతులు బహిష్కరించడం.. రాజధాని రాజకీయాల్లో కొత్త దుమారానికి దారి తీసింది.


