● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై
ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజం
ఉరవకొండ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు మూలంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ విషయంపై సమీక్షించేందుకు కనీసం డీఆర్సీ (జిల్లా సమీక్ష కమిటీ) సమావేశం నిర్వహించే తీరిక లేకపోవడం అన్యాయమంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి భరత్ రాయలసీమ వాసి అయినా, రైతాంగాన్ని ఆదుకోవడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కనీసం సమీక్ష నిర్వహించే తీరిక ఆయనకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఉత్సవ విగ్రహాల్లా మారారన్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి ఎద్దడితో పాటు పశువులకు నీరు, పశుగ్రాసం అందకుండా పోయాయన్నారు. జిల్లాలో 40 లక్షల పశుసంపద ఉందని, ఇందులో 2 లక్షల ఎద్దులు, గేదెలు 1.80 లక్షలు, గొర్రెలు 30 లక్షల వరకూ ఉన్నాయన్నారు. ఒక్కో పశువుకు 30 కిలోల గ్రాసం అవసరం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో కిలో గ్రాసం దొరికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ముగ్గురు మంత్రులు కనీసం రైతాంగంలో ఆత్మస్థ్యైరం నింపే ప్రయత్నం చేశారా అంటూ నిలదీశారు. ఇప్పటికై నా మేల్కొని జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జాతీయస్థాయి పోటీలకు ఖాదర్పేట విద్యార్థిని
పామిడి: ఖాదర్పేట జెడ్పీహైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆర్.ప్రణయ జాతీయ స్థాయి సబ్–జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం పురుషోత్తం బాబు, పీడీ ఎస్.శిరీష తెలిపారు. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రణయ ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంద న్నారు. అక్టోబర్ 3 నుంచి 7వ తేదీ వరకు చత్తీస్ఘడ్లోని భిలాయిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ప్రణయ పాల్గొంటుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని హెచ్ఎం, పీడీతో పాటు స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య, సెక్రెటరీ వెంకటేష్ అభినందించారు.


