దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం
● మూడు చక్రాల స్కూటర్ ఇవ్వలేదని మనస్తాపం
అనంతపురం అర్బన్: మూడు చక్రాల స్కూటర్ మంజూరు చేయలేదన్న మనస్తాపంతో ఓ దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన పి.విరూపాక్షి దివ్యాంగుడు సోమవారం కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’ వద్దకు వచ్చాడు. అర్జీల స్వీకరణ కౌంటర్లకు కొద్ది దూరంలో కూర్చుని సంచిలో నుంచి డీజిల్ బాటిల్ బయటకు తీశాడు. అదే సమయంలో విరుపాక్షి చర్యను ఏఎస్ఐ వెంకటేష్ గమనించి వెంటనే వచ్చి బాటిల్ను లాగేసుకున్నాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నిస్తే.. తాను దివ్యాంగుడినని, తన భార్య క్యాన్సర్తో బాధపడుతోందని చెప్పాడు. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే వాహనాలు అద్దెకు తీసుకునే స్థోమత లేదని, తనకు మూడు చక్రాల స్కూటర్ మంజూరు చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందని విరూపాక్షి చెప్పాడు. ఏడాదిన్నర కాలంగా అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉన్నానని, అయితే పదో తరగతి సర్టిఫికెట్ లేదని మంజూరుకు ససేమిరా అంటున్నారని తెలిపాడు. సర్టిఫికెట్ లేకపోతే మాలాంటి వారు నేలమీద దోక్కుంటూ వెళ్లాల్సిందేనా అంటూ ఆవేదన చెందాడు. పీజీఆర్ఎస్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి అక్కడికి చేరుకుని విషయం తెలుసుకున్నారు. ఆమె ఆదేశాల మేరకు విరూపాక్షిని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వద్దకు పోలీసులు తీసుకెళ్లారు. ఆయనకు విరుపాక్షి తన గోడును వినిపించాడు. స్పందించిన జేసీ మూడు చక్రాల స్కూటర్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


