రాప్తాడు రూరల్: కష్టకాలంలో స్నేహితుడికి స్నేహ హస్తం అందించారు. అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లికి చెందిన బుర్రా జయకృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం అయ్యాడు. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న జయకృష్ణ అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు సపర్యలు చేసేందుకు భార్య తోడు తప్పనిసరి అయింది. కూలి పనులు మానేసి ఆమెకూడా ఇంటివద్దే ఉంటోంది. ఇటీవల ఆమె కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. వారికి 9వ తరగతి, 7వ తరగతి చదువుతున్న కుమారులున్నారు. ఆ కుటుంబ దుస్థితిపై ఇటీవల ‘సాక్షి’లో ‘కష్టాల సుడిగుండం...కన్నీటి ప్రయాణం’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనానికి మానవతావాదులు స్పందించారు. ఇప్పటికే గ్రామస్తులు, ఇతరులు సుమారు రూ. 1.20 లక్షల దాకా ఆర్థిక చేయూత అందించారు. ఆదివారం జయకృష్ణ చిన్ననాటి స్నేహితులు మానవత్వాన్ని చాటుకుంటూ రూ.31 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామానికి చేరుకుని జయకృష్ణను స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పారు.
కట్టకిందపల్లి బుర్రా జయకృష్ణకు రూ.31 వేలు సాయమందించిన స్నేహితులు


