అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారానికి గురువారం నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ తెలిపారు. బుధవారం రెవెన్యూ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో రీ–సర్వే చేసిన ఒక గ్రామాన్ని, రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్న గ్రామాన్ని తహసీల్దార్లు ఎంపిక చేయాలన్నారు. నెలలో ప్రతి గురువారం సంబంఽధిత అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించాలన్నారు. గురువారం సెలవు దినమైతే మరుసటి రోజు వెళ్లాలని, తహసీల్దారు, ఎంపీడీఓ, ఏఆర్ఐ, సర్వేయర్, దేవదాయ భూములుంటే ఆ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. మొదటి గురువారం ప్రజల నుంచి అసైన్డ్ భూములు, 22ఏ, చెరువు పోరంబోకు,సర్వే సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని, సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. మిగిలినవి పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. రెండో గురువారంలో మొదటి వారం స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన, రికార్డుల పరిశీలన నిర్వహించాలన్నారు. మూడో గురువారం విచారణ పూర్తయిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని, మ్యుటేషన్, ఆర్ఓఆర్ సవరణ తదితర రెవెన్యూ అంశాలపై ఆదేశాలు జారీ చేయాలన్నారు. నాల్గో గురువారం గ్రామసభ నిర్వహించి పరిష్కరించిన సమస్యల జాబితాను ప్రకటించాలన్నారు. కోర్టు కేసులు మినహా మిగిలిన అన్ని ఫిర్యాదులు పరిష్కరించాలని, గ్రామాలను జీరో పెండెన్సీగా తీర్చిదిద్దాలని జేసీ పిలుపునిచ్చారు.
జేసీ విష్ణుచరణ్


