కూడేరు: అడిగేవారు లేరని అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏకంగా ప్రైవేట్ వెంచర్ కోసం సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ వారికి లబ్ధికలిగేలా రోడ్డు వేయడమేంటని ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల ఉపాధి హామీ పథకం కింద మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా గొటుకూరు పంచాయతీకి రూ.50లక్షల నిధులు మంజూరయ్యాయి. పంచాయతీ పరిధిలో బ్రాహ్మణపల్లి, రామచంద్రాపురం, గొటుకూరు గ్రామాలు ఉన్నాయి. ఇందులో చాలా కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అయితే రామచంద్రాపురానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఇలాంటి కాలనీలను పక్కనపెట్టి బ్రాహ్మణపల్లి వద్ద అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కన స్కంద వెంచర్లో సీసీ రోడ్డు వేయాలని నిర్ణయించారు. అధికారులను సైతం ఇందుకు ఒప్పించారు. వారే కాంట్రాక్టర్ అవతారమెత్తారు. రెండు రోజుల క్రితం స్కంద వెంచర్లో 40 అడుగుల వెడల్పుతో వెయ్యి మీటర్లు సీసీ రోడ్డు నిర్మించేందుకు ఉపక్రమించారు. బెడ్డింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. రెండు రోజుల క్రితం కొంతదూరం వరకు సిమెంటు రోడ్డు వేసి.. నీళ్లు క్యూరింగ్ పెట్టారు. ఈ రోడ్డు వేస్తున్నది ప్రభుత్వ నిధులతో అని తెలుసుకున్న ప్రజలు అవాక్కయ్యారు. ప్రభుత్వ ధనం ప్రజలకు ఉపయోగపడాలి కానీ ఇలా ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రూ.50 లక్షలతో వెంచర్లో వేస్తున్న సిమెంట్ రోడ్డును రద్దు చేసి.. పంచాయతీ పరిధిలో అధ్వానంగా ఉన్న చోట్ల రోడ్లు వేయాలని కోరుతున్నారు.
6న జేఎన్టీయూ(ఏ) స్నాతకోత్సవం
● గౌరవ డాక్టరేట్కు టెస్సీ థామస్ ఎంపిక
అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం) 15వ స్నాతకోత్సవం ఏప్రిల్ ఆరో తేదీన నిర్వహించనున్నారు. భారతదేశ క్షిపణి మహిళ (మిస్సైల్ ఉమెన్)గా ఖ్యాతి దక్కించుకున్న టెస్సీ థామస్ను గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేశారు. ఛాన్సలర్ /గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై జేఎన్టీయూ(ఏ) గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారు. ఈ మేరకు స్నాతకోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి.
అగ్ని పుత్రి టెస్సీ థామస్
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)లో టెస్సీ థామస్ ఏరోస్పేస్ ఇంజినీర్ పనిచేస్తున్నారు. ఈమెను అగ్నిపుత్రిగా పిలుస్తారు. అగ్ని–4 క్షిపణికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించి, మిస్సైల్ ప్రాజెక్ట్ను నడిపించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఈమె కేరళలోని త్రిశూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్, పుణెలో ఎంటెక్, మిస్సైల్ గైడెన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. 1988లో డీఆర్డీఓలో చేరి, అగ్ని సిరీస్ క్షిపణుల అభివృద్ధిలో, ముఖ్యంగా అగ్ని–2, 3, 4, 5 క్షిపణుల గైడెన్స్, నావిగేషన్ సిస్టమ్లో కీలక పాత్ర పోషించారు. టెస్సీ థామస్కు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మార్గదర్శకులు.
కనికరించి..
పరిష్కరించరూ..!
అనంతపురం అర్బన్: తమ పట్ల కనికరం చూపి.. సమస్యలను పరిష్కరించాలని అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, ఆనంద్ వివిధ సమస్యలపై ప్రజల నుంచి 417 అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ సమస్యలపైనే 280 అర్జీలు ఉండటం గమనార్హం. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
జన గణన పక్కాగా చేపట్టాలి
అనంతపురం అర్బన్: జన గణన పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. జనగణన–2027కు సంబంధించి మొదటి దశ గృహ గణన నిర్వహణపై నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కామర్స్ కాన్ఫరెన్స్ హాలులో సిబ్బందికి ఏర్పాటు చేసిన మొదటి విడత శిక్షణ తరగతులను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన ఈసారి గతం కంటే భిన్నంగా పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారన్నారు. జనగణన అధికారులు, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మొదటి దశలో గృహ గణనకు సంబంధించి డేటా సేకరణలో ప్రజలకు ఉన్న అపోహలు తొలగించాలని చెప్పారు. 29వ తేదీ వరకు మూడు బ్యాచ్లకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన గణాంకాల ద్వారా గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయస్థాయిలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, సీపీఓ అశోక్కుమార్, ఆర్డీఓ కేశవ నాయుడు, గణాంక అధికారి గిరిధర్, అనంతపురం ఇన్చార్జ్ తహసీల్దార్ రాజా, సెన్సస్ విభాగం డీటీ మధుసూదన్రావు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, మాస్టర్ ట్రైనర్లు జీఎల్ఎన్ ప్రసాద్, కిరణ్, సెన్సస్ నోడల్ అధికారులు మోహిత్ వర్మ, లక్ష్మీకళ, ఎన్నికల డీటీ కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ వెంచర్లో
సీసీ రోడ్డు నిర్మాణం
ఇదీ అధికార పార్టీ నేతల నిర్వాకం
వంతపాడిన అధికార గణం
ఆగ్రహించిన ప్రజానీకం
అవును.. కొంత రోడ్డు వేశారు
బ్రాహ్మణపల్లి వద్ద స్కంద వెంచర్లో ఉపాధి హామీ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టారు. కొంత దూరం వరకు రోడ్డు నిర్మించిన మాట వాస్తవమే. జియో ట్యాగ్ కాకపోవడంతో ప్రస్తుతం ఆ పనిని నిలిపివేశాం.
– రమణయ్య, ఏఈ, పంచాయతీ రాజ్
ప్రజా సమస్యల పరిష్కార
వేదికలో అర్జీదారుల విన్నపాలు


