అబ్బుర పరిచిన చిన్నారి సాహసం
తాడిపత్రి టౌన్: స్థానిక అయాన్ తైక్వాండో అకాడమీలో ఆదివారం ఓ చిన్నారి సాహసం అబ్బురపరిచింది. తాడిపత్రిలోని కృష్ణాపురం ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి యశ్వనిభారతి ఆరు నిమిషాల 9 సెకన్ల వ్యవధిలో వంద ట్యూబ్లైట్లను తన తలపై పగులకొట్టించి పలువురి ప్రశంసలు అందుకుంది. నోబెల్ వరల్డ్ రికార్డు కోసం ఈ విన్యాసాన్ని చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి హాజరై, చిన్నారిని అభినందించారు.
అమ్మోనియం నైట్రేట్
డంప్ స్వాధీనం
పామిడి: మండలంలోని నీలూరు మార్గంలో ఉన్న కంబగిరి రాముడు కంకర క్రషర్ యూనిట్లో అక్రమంగా డంప్ చేసిన 98 బస్తాల అమ్మోనియం నైట్రేట్ను పామిడి ఇన్ఛార్జ్ సీఐ ప్రవీణ్కుమార్ స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారంతో ఆదివారం తనిఖీలు చేపట్టి పరిమితికి మించి అమ్మోనియం నైట్రేట్ను డంప్ చేసినట్లుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రైలు ప్రయాణికుడి మృతి
గుంతకల్లు: తిరుమల దర్శనం కోసం వెళుతూ గుండెపోటుతో ఓ రైలు ప్రయాణికుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన ఎం.రాకేష్ (44), తన భార్య విద్య, పిల్లలు, బంధువులతో కలసి తిరుమల దర్శనార్థం ఆదివారం ముంబయి – చెన్నె (22159) ఎక్స్ప్రెస్ రైలులో తిరుపతికు బయలుదేరాడు. రాయచూర్ రైల్వేస్టేషన్కు సమీపంలోకి రైలు చేరుకుంటుండగా రాకేష్కు చాతీలో నొప్పి వచ్చింది. దీంతో రాయచూర్ రైల్వే స్టేషన్ దిగేందుకు సిద్ధమవుతుండగా నొప్పి తగ్గిపోవడంతో ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలోనే మరోసారి నొప్పి మొదలు కాగానే విషయాన్ని రైల్వే సిబ్బందికి తెలిపారు. అప్రమత్తమైన రైల్వే యాజమాన్యం రైలు గుంతకల్లు రైల్వేస్టేషన్కు చేరుకున్న వెంటనే రాకేష్తో పాటు కుటుంబసభ్యులు, బంధువులను దింపి ఆగమేఘాలపై రైల్వే ఆస్సత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాకేష్ మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తుంగభద్ర కాలువలో
మరో మృతదేహం
బొమ్మనహాళ్: తుంగభద్ర ఎగువ కాలువ ( హెచ్చెల్సీ) ఇప్పుడు భయానకంగా మారింది. హెచ్చెల్సీలో గత రెండు రోజుల వ్యవధిలోనే మూడు మృతదేహాలు బయటపడడంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. బొమ్మనహాళ్ హెచ్చెల్సీ సెక్షన్ పరిధిలోని డి.హీరేహాళ్ మండలం నాగలాపురం సమీపంలోని 117, 116 కిలోమీటర్ల వద్ద శనివారం రెండు మృతదేహాలు బయట పడగా.. ఆదివారం మరో మృతదేహం తేలింది. కాళ్లకు తాళ్లు కట్టేసి ఉండడంతో మిస్టరీగా మారింది. ప్రమాదమా? హత్యనా? ఆత్మహత్యానా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఒకే ప్రాంతంలో వరుసగా మూడు మృతదేహాలు లభ్యం కావడం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం కనిపించిన రెండు మృతదేహాల్లో హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న ఓ శవాన్ని ముందుకు తోసేయడంతో అది ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తును తప్పించుకునేందుకు హెచ్చెల్సీ ఉపరిభాగంలో ఉన్న పోలీసులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని, అయితే దిగువన ఉన్న డి.హీరేహాళ్ పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోజుకొక శవం కాలువలో కొట్టుకు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మృతదేహాలు కర్ణాటక ప్రాంతం నుంచి కొట్టుకువచ్చాయా? లేదా జిల్లా వాసులవా? అనేది తేలాల్సి ఉంది.
భర్త తాగుడు భరించలేక
వివాహిత ఆత్మహత్య
పెనుకొండ రూరల్: సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చు పెడుతుండడంతో కుటుంబ పోషణ భారమైన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు... బిహార్లోని గోపల్ఘంజ్ జిల్లా లోహిజరా గ్రామానికి చెందిన ప్రిన్స్ కుమార్ రాయ్కు రెండేళ్లుగా కియా పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం ఆయనకు తన సొంత గ్రామానికి చెందిన అంజలీకుమారి (23)తో వివాహమైంది. భార్యతో కలసి గుట్టూరులో నివాసముంటున్నాడు. భర్త మద్యానికి బానిస కావడంతో దంపతుల మద్య తరచూ వివాదాలు చోటు చేసుకునేవి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న అంజలీకుమార్ ఆదివారం తెల్లవారుజామున పడక గదిలోని పైకప్పునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
అబ్బుర పరిచిన చిన్నారి సాహసం
అబ్బుర పరిచిన చిన్నారి సాహసం
అబ్బుర పరిచిన చిన్నారి సాహసం


