
వ్యక్తి దుర్మరణం
రాయదుర్గం టౌన్: అతి వేగం ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... శెట్టూరు మండలం మాలేపల్లి గ్రామానికి చెందిన బసవరాజు (32)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ మొబైల్ కంపెనీలో కేబుల్ నెట్వర్క్ ఇంజినీర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రాయదుర్గం మండలం గుండ్లపల్లి వద్ద జరుగుతున్న కేబుల్ పనులను ఆదివారం పర్యవేక్షించిన బసవరాజు... మధ్యాహ్నం డ్రైవర్ కమల్తో కలసి డీ–మ్యాక్స్ వాహనంలో భోజనానికని ఆవులదట్ట గ్రామానికి బయలుదేరారు. కాశీపురం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వేగంగా దూసుకెళ్లడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొని పల్లంలోకి బోల్తాపడింది. ఘటనలో బసవరాజు వాహనంలోనే ఇరుక్కొని మృతి చెందాడు. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
యువకుడి బలవన్మరణం
నార్పల: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నార్పలలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా నివాసముంటున్న ఆదినారాయణ, బాలవీరమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఇటీవల కుమారుడు హర్ష (27)కు వివాహం నిశ్చయమమైంది. ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా మనోవేదనకు లోనైన హర్ష.. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు.. ఎంత సేపటకీ హర్ష తలుపులు తీయకపోవడంతో బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని గుర్తించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
బంగారు గొలుసు అపహరణ
గుంతకల్లు టౌన్: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. కాలనీలోని మసీదు పక్కన వన్నూర్రెడ్డి, రమాదేవి దంపతులు కిరాణా కొట్టు (రెడ్డి షాపు) ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కొట్టులో రమాదేవి కూర్చొని వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరు కొట్టు దగ్గరికెళ్లి సిగరెట్లు కావాలని అడిగాడు. ఆ సమయంలో సిగరెట్ ప్యాకెట్ తీసుకునేందుకు రమాదేవి అటు తిరగగానే వెనుక నుంచి ఆమె మెడలోని 3 తులాల బరువున్న బంగారు గొలుసును లాక్కొని అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్ పై ఎక్కి ఉడాయించాడు. రమాదేవి గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ మనోహర్, టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
నాన్నా అంటూ పరుగెత్తుకెళ్లి..
● వాహనం కిందపడి చిన్నారి మృతి
యాడికి: మండలంలోని లక్షుంపల్లి గ్రామంలో ఆదివారం మద్యాహ్నం వాహనం కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాలు.. లక్షుంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం తాను సాగుచేసిన టమాట పంటను తొలగించి వాహనంలో వేసుకుని మధ్యాహ్నం ఇంటి వద్దకు చేరుకున్నాడు. కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం పంటను మార్కెట్కు తరలించేందుకు బయలుదేరుతుండగా తన తండ్రి వెళుతున్నట్లు గుర్తించిన రెండేళ్ల వయసున్న చిన్న కుమార్తె పరుగున ఇంటి బయటకు చేరుకుంది. అప్పటికే ముందుకు కదిలిన వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. చిన్నారిని ఆగమేఘాలపై అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందింది. విషయం తెలియగానే ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
యువకుడి అనుమానాస్పద మృతి
నల్లమాడ: అమడగూరు మండలం మహమ్మదాబాద్ సచివాలయం సమీపంలో ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఓ యువకుడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన గుణిశెట్టి రాజేష్(36)కు ఏడేళ్ల క్రితం అమడగూరు మండలం మహమ్మదాబాద్ పంచాయతీ బావిచెరువుపల్లికి చెందిన కేశవయ్య కుమార్తె సుమిత్రతో వివాహమైంది. తాగుడుకు బానిసైన రాజేష్ తనను తరచూ వేధిస్తున్నాడంటూ కొన్నేళ్ల క్రితం భర్తను వదిలి తల్లిదండ్రుల వద్దకు సుమిత్ర చేరుకుంది. ఆదివారం బావిచెరువుపల్లిలోని అత్తారింటికి వెళ్లిన రాజేష్... భార్యను కాపురానికి రావాలని కోరాడు. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. అనంతరం ఏమి జరిగిందో ఏమో.. మహమ్మదాబాద్ సచివాలయం సమీపంలో చెట్టుకు వేసిన ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

వ్యక్తి దుర్మరణం

వ్యక్తి దుర్మరణం