
కేజీబీవీ విద్యార్థులను తీర్చిదిద్దాలి
● విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు
కడప ఎడ్యుకేషన్: కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులను చదువులో దిట్టలుగా మార్చాలని కేజీబీవీ సబ్జెక్టు టీచర్లకు రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు పిలుపు నిచ్చారు. కడప నగర శివారులోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్య మేరీ అధ్యక్షతన రాయలసీమ పరిధిలోని కేజీబీవీలలో పనిచేసే ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్లకు ఇన్ సర్వీస్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాయలసీమ పరిఽధిలోని కడప, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాలతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ.. కేజీబీవీలలో విద్యనభ్యసించే వారంతా చదువుతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారేనన్నారు. అలాంటి వారిని చదువుల్లో దిట్టలుగా చేయడం అదృష్టంగా భావించాలన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానంద రాజులు మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా తెలుసుకున్న మరిన్ని కొత్త విషయాలను తరగతి గదిలో విద్యార్థులకు బోధించడం ద్వారా వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష కార్యాలయ సూపరింటెండెంట్ ప్రేమకుమారి, సెక్టోరియల్ అధికారి వీరేంద్రరావు, ఏఎస్ఓ సంజీవరెడ్డి, రిసోర్సు పర్సన్లు సమగ్రశిక్ష సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎకాలజీ సెంటర్లో ఉచిత శిక్షణ
అనంతపురం అగ్రికల్చర్: హౌస్ వైరింగ్, మోటార్ రివైండింగ్ లాంటి ఎలెక్ట్రికల్ కోర్సుల్లో ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సెంటర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కనీసం 5వ తరగతి వరకు చదివి, 18 నుంచి 40 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులు. శిక్షణా కాలంలో మధ్యాహ్న భోజన వసతి ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్తో పాటు ఉచితంగా టూల్కిట్ అందిస్తారు. అలాగే 100 శాతం ఉపాధి అవకాశాల కల్పనకు చొరవ తీసుకుంటారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఎకాలజీ సెంటర్ కార్యాలయంలో పనివేళల్లో లేదా, 97044 07134, 77807 52418 నంబర్లలో సంప్రదించవచ్చు.