
పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
హిందూపురం: ఆర్థిక ఇబ్బందులతో న్యాయవాదులను నియమించుకోలేని నిరుపేద ఖైదీలకు న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్జి ఈ. భీమారావు తెలిపారు. శనివారం ఆయన ఏడీజే కంపల్లె శైలజ, జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యదర్శి రాజశేఖర్, సీనియర్ సివిల్ జడ్జి డి.వెంకటేశ్వర్లు నాయక్, ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్యతో కలిసి స్థానిక సబ్జైలును తనిఖీ చేశారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ఖైదీలకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. భోజనం సిద్ధం చేసేందుకు ఉపయోగిస్తున్న సరుకుల నాణ్యతను పరిశీలించేందుకు శాంపిల్స్ పంపించాలని అధికారులను ఆదేశించారు. సబ్ జైలులో ఆన్లైన్ సౌకర్యం కల్పించాలని సబ్జైలు అధికారి హనుమన్నను ఆదేశించారు. అనంతరం పలువురు ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తాము ఏ తప్పు చేయకపోయినా పోలీసులు ఉద్దేశపూర్వకంగా తమను ఇబ్బందులకు గురి చేస్తూ కేసులు పెట్టి జైళ్లకు పంపారని జిల్లా జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తాము జైలులో ఉంటే తమపై కేసులు పెట్టిన వ్యక్తులు తమ కుటుంబీకులను ఇబ్బందులు పెడుతూ గ్రామంలోకి రాకుండా అడ్డు కుంటున్నారని వాపోయారు. వారి ఆవేదన విన్న జడ్జి అరెస్టు సమయంలోనే జడ్జి ముందు పోలీసుల వేధింపుల గురించి చెప్పాలన్నారు. ఏం జరిగిందో నిర్భయంగా చెప్పినప్పుడే న్యాయ సహాయం అందుతుందన్నారు. కారాగారంలో ఉన్న ఖైదీలంతా మార్పు చెంది సమాజంలోకి వెళ్లాలన్నారు. అనంతరం ఆయన స్థానిక సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం భవన సముదాయాన్ని పరిశీలించారు. కోర్టు ఆవరణంలో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలు, వాటి నాణ్యత గురించి ఆర్అండ్బీ ఇంజినీర్, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా జడ్జి వెంట న్యాయవాదులు రాజశేఖర్, నవేరా, భరత్ సింహా తదితరులు ఉన్నారు.
సబ్జైలు తనిఖీలో జిల్లా జడ్జి భీమారావు

పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం