
వేగం.. సులభం.. సురక్షితం!
రాయదుర్గం టౌన్: జేబులో రూ.500 నోటు పెట్టుకుని దుకాణానికి వెళ్లడం.. నచ్చిన వస్తువు కొనుగోలు చేసిన తర్వాత చిల్లర సమస్యతో సతమతమవడం.. ఇది నిన్నామొన్నటి వరకూ ప్రజలు పడిన ఇబ్బందులు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటిల్ మనీ రూపాంతరం చెందడంతో ఈ ఇబ్బందికి చెక్ పడింది. ఈ లావాదేవీలు వేగంగా, సులభంగా, సురక్షితంగా జరుగుతుండడంతో అందరూ వీటిపై ఆకర్షితులయ్యారు. దీంతో చిన్నపాటి కిళ్లీ కొట్టు మొదలు... షాపింగ్ మాల్స్ వరకూ ఎటు చూసినా డిజిటల్ పేమేంట్లు ఊపందుకున్నాయి. ఎటు చూసినా ఫోన్పే, గూగుల్పే, పేటీఎం క్యూ ఆర్ కోడ్లు కనిపిస్తున్నాయి.
చిటికెలో చెల్లింపులు
జిల్లాలో దాదాపు రెండు లక్షలకు పైగా వ్యాపార సముదాయాలున్నాయి. కిరాణాకొట్లు, కిళ్లీ బంకులు, వస్త్ర దుకాణాలు, మెడికల్ షాపులు.. చివరికి బస్సులు, రైళ్లలో ప్రయాణాలకు సైతం డిజిటల్ మనీని స్వీకరిస్తున్నారు. మరికొన్ని చోట్ల కార్డు స్వైపింగ్ కోసం పీఓఎస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలు తమ ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో యాప్లను డౌన్లోడ్ చేసుకుని చిటికెలో చెల్లింపులు జరుపుతున్నారు. ఆన్లైన్ ద్వారా జిల్లాలో రోజూ రూ.100 కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతున్నట్లు అంచనా.
చిల్లరతో పనేదీ?
గతంలో రూపాయి, రెండు, ఐదు రూపాయల కాయిన్లకు డిమాండ్ ఉండేది. హోటళ్లు, కిరాణా దుకాణాల్లో అవసరమున్న చిల్లర లభ్యత కాగా కొనుగోలుదారులు ఇబ్బంది పడేవారు. దీంతో వ్యాపారులు రూ.10 కమీషన్ చెల్లించి వంద రూపాయలకు చిల్లర తీసుకునేవారు. ఒకప్పుడు ఈ తరహా వ్యాపారం జిల్లాలో భారీగా జరిగేది. ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపుల కారణంగా చిల్లర అవసరాలు పూర్తిగా తగ్గాయి.
లెక్క లేకుండా ఖర్చు
డిజిటల్ మనీ వ్యాప్తిలోకి వచ్చాక ఎంత మేలు జరుగుతుందో.. అంతే నష్టం పొంచి ఉంది. గతంలో జేబులో ఉన్న డబ్బును ఎంత వరకు అవసరమో అంత మేరకే వినియోగించేవారు. అయితే ప్రస్తుతం వచ్చిన నగదు చెల్లింపుల యాప్లతో ఎంత వెచ్చిస్తున్నామనే అంశంపై అవగాహన ఉండడం లేదు. క్రెడిట్ కార్డుల్లో ఉన్న మొత్తంతో పాటు ఓవర్ లిమిట్ సౌకర్యాన్ని సైతం కల్పిస్తుండడంతో షాపింగ్లు, సినిమాలు, షికార్లకు యువత ప్రాధాన్యతనిస్తున్నారు. డబ్బులను తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో డిజిటల్ మనీ లావాదేవీల విషయంగా అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మోసపూరిత లింకులు, సైబర్ కేటుగాళ్లతో జాగ్రత్త
ఆన్లైన్ చెల్లింపులు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో... అంతే వేగంగా సైబర్ మోసగాళ్లు వల విసురుతున్నారు. లింకులను పంపి వాటిని క్లిక్ చేయాలని సూచిస్తున్నారు. అవగాహన లేని కొందరు వాటిని క్లిక్ చేయగానే వారి బ్యాంక్ ఖాతాల్లోని నగదును అప్పనంగా కాజేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత లింకులు, సైబర్ కేటుగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
డిజిటల్ మనీతో దూరమైన నగదు ఇక్కట్లు
స్మార్ట్ఫోన్ ద్వారా క్షణాల్లో నగదు చెల్లింపులు
కిళ్లీ కొట్టు మొదలు.. షాపింగ్మాల్ వరకూ అంతా డిజటల్ చెల్లింపులే